Stock market: మార్కెట్లను వెంటాడుతున్న ఫెడ్ బూచి.. వరుస లాభాలకు బ్రేక్.. మెరిసిన మెటల్ స్టాక్స్..
Stock market: భారత స్టాక్ మార్కెట్లలో ఆరు రోజుల వరుస బుల్ జోరుకు బ్రేక్ పడింది. గత వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియటంతో ఈ వారం అదే బుల్ పరంపర కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే అమెరికన్ మార్కెట్లు నష్టాల్లో ముగియటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాల మధ్య ఈరోజు ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అయ్యాయి.
ఇంట్రాడే ఆరంభంలోనే 200 పాయింట్ల నెగటివ్ లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 306 పాయింట్ల నష్టంతో 55,766 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 88 పాయింట్లు క్షీణించి 16,631 మార్క్ వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఆటో రంగం షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగగా.. మెటల్ స్టాక్స్ మాత్రం లాభాలను నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో ఐటీ కంపెనీల షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు మద్దతు చూపడంతో మార్కెట్లు కొంత కోలుకున్నాయి.
ఈ వారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నందున రిటైలర్లు, ట్రేడర్లు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్లు నిపుణులు అంటున్నారు. మరో పక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలు అంచనాలను మిస్ కావటం మాంద్యాన్ని సూచిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారం మెుత్తం మార్కెట్లు ఒడిదొడుకులతో కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా & మహీంద్రా, మారుతీ, ఐషర్ మోటార్స్, ONGC, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవటం వల్ల నష్టాలను నమోదు చేసి మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. మార్కెట్లను కిందకు లాగాయి. ఇదే సమయంలో.. టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో, NTPC, విప్రో, HCL టెక్, L&T షేర్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.