Stock Market: మాంద్యం సూచికలతో మార్కెట్లు కుదేలు.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..
Stock Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభాన్ని నష్టాలతో ముగించాయి. ఈ రోజు ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. భారత వృద్ధి రేటును రిజర్వు బ్యాంక్ తగ్గించటంతో మదుపరులు అప్రమత్తంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడు గత వారం రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరగటం అనేక మందిపై వడ్డీల భారాన్ని పెంచింది.
సూచీలు ఇలా..
కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 638 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 602 పాయింట్ల, నిఫ్టీ మిడ్ క్యాప్ 383 పాయింట్ల మేర నష్టపోయాయి. అయితే నిపుణులు ఈ వారం మార్కెట్లు గతవారం మాదిరిగా లాభాల బాటను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అమెరికాలో ముదిరిన మాంద్యం..
2008 సమయంలో ప్రఖ్యాత లిమన్ బ్రదర్స్ కంపెనీ కుప్పకూలిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. అయితే ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ credit suisse కుప్పకూలటానికి సిద్ధంగా ఉందనే వార్తలు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది మాంద్యానికి మెుదటి సూచిక అని అనేక మంది నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు అమ్మకాలకు మెుగ్గుచూపుతున్నారు.
టాప్ గెయినర్స్..
ఈ రోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబ్, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
టాప్ లూజర్స్..
మార్కెట్లు ముగిసే నాటికి అదానీ ఎంటర్ ప్రైజస్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా కన్జూమర్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, ఎస్బీఐ, బ్రిటానియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ తో పాటు ఇతర కంపెనీల షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.