Stock Market: మార్కెట్లను చుట్టుముట్టిన మాంద్యం భయాలు.. బేజారిన సూచీలు.. ఐటీ షేర్లు..
Stock Market Update: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత సెషన్ నుంచి నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ రోజు ఉదయం కూడా అవి స్వల్పంగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఉదయం 11.25 గంటలకు సెన్సెక్స్ 228.50 పాయింట్లు క్షీణించి 54,166.02 వద్ద, నిఫ్టీ 80.65 పాయింట్లు క్షీణించి 16,135.35 వద్ద ట్రేడవుతున్నాయి. ఈక్విటీ, బాండ్, కరెన్సీతో పాటు కమోడిటీ మార్కెట్లు దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే ఆర్థిక మాంద్యం భయాలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఫెడ్ చర్యలు, ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం వంటి కారణాలు మార్కెట్లను ఆవరించటం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు మెుగ్గుచూపుతున్నారు.
దేశంలోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి త్రైమాసిక ఫలితాలు IT పరిశ్రమకు మార్జిన్ ఒత్తిడిని సూచించాయి. ఇది IT ఇండెక్స్ను బలహీనపరిచింది. దీనికి తోడు రూపాయి స్థిరంగా బలహీనపడటం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈక్విటీలను విక్రయించడం కూడా దేశీయ స్టాక్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ఉదయం డాలర్ తో రూపాయి మారకపు విలువ 79.59 వద్ద సరికొత్త రికార్డు కనిష్ఠాలను చేరుకుంది. పైగా జూన్ మాసంలో దేశ వాణిజ్య లోటు అమాంతం పెరిగి 25.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.
అంతేకాకుండా.. జూలై 1తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 5 బిలియన్ డాలర్లు క్షీణించి 588.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రూపాయి-డాలర్ మారకపు రేటులో ఒలటాలిటీని తగ్గించడానికి ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లలో ముందస్తుగా జోక్యం చేసుకుంటోంది. ఈ పతనాన్నికట్టడి చేసేందుకు ప్రయత్నాలను కేంద్రం కూడా ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఓఎన్జీసి, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హిందాల్కొ, ఐషర్ మోటార్స్, టైటాన్, యూపీఎల్, టాటా స్టీల్, బ్రిటానియా, టాటా కన్సల్టెన్సీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్ డబ్యూ స్టీల్, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.