జోరు మీదున్న స్టార్టప్ కంపెనీలు.. రూ.1,400 కోట్ల పెట్టుబడి సమీకరణ!
ఒక పక్క ప్రపంచమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంటే... మన ఇండియన్ స్టార్టప్ కంపెనీలైతే నిధుల ప్రవాహంతో తడిసిపోతున్నాయి. ఎందుకంటే గత వారం రోజుల్లోనే 13 విజయవంతమైన స్టార్టుప్ కంపెనీలు సుమారు రూ 1,400 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయి. దీంతో కరోనా వైరస్ ప్రభావం టెక్నాలజీ ఆధారిత స్టార్టుప్ కంపెనీలపై లేదని రుజువు అవుతోంది. అయితే ఇదే సూత్రం అన్ని స్టార్టుప్ కంపెనీలకు వర్తించదు కానీ... కొన్ని కంపెనీలు మాత్రం పెట్టుబడుల సమీకరణలో దూసుకుపోతున్నాయి.
పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో నిధులను సమీకరిస్తూ వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సరళి ఇలాగే కొనసాగితే మరిన్ని స్టార్టప్ కంపెనీలకు గట్టి మద్దతు లభించటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఒక్కో రంగంలో పనిచేస్తున్న స్టార్టుప్ కంపెనీకి ఒక్కో విధమైన పెట్టుబడుల సరళి ఉంటుంది. కానీ టెక్నాలజీ ఆధారిత కంపెనీలకు మాత్రం వాల్యుయేషన్ చాలా అధికంగా లభిస్తోంది.
ఆయా సంస్థలు రియల్ టైం ప్రోబ్లం కు సొల్యూషన్ చూపించటమే దానికి కారణం. సరైన ఐడియా, సమర్థవంతమైన నాయకత్వం ఉంటే నిధుల సమీకరణ అనుకున్నంత పెద్ద కష్టమైన పనేమీ కాదని ప్రస్తుత పెట్టుబడుల వరద చెబుతోంది.
రెండ్రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర, మరింత కాలం ఇంతేనా? తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే
ఒక్క కంపెనీకి 150 మిలియన్ డాలర్లు...
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ పోస్టుమాన్ ... ప్రైవేట్ ఈక్విటీ నిధుల సమీకరణలో ముందు వరుసలో ఉంది. టెక్నాలజీ ఆధారిత స్టార్టప్ కంపెనీ అయిన పోస్టుమాన్ ... ఏకంగా 150 మిలియన్ డాలర్ల (రూ 1,125 కోట్లు) పెట్టుబడులు ఆకర్షించటం విశేషం. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. అందులో అనేక ఆసక్తికరమైన స్టార్టుప్ పెట్టుబడుల వివరాలు వెల్లడించింది. బెంగళూరు కు చెందిన ఈ కంపెనీ సాఫ్ట్ వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) మోడల్ లో ఏపీఐ డెవలప్మెంట్ సేవలు అందిస్తుంది. ప్రస్తుతం ఇందులో ఇన్సైట్ పార్టనర్స్ తో పాటు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సిఆర్వి , నెక్సస్ వెంచర్ పార్టనర్స్ కూడా పెట్టుబడి పెట్టాయి. ఇందులో మరో విశేషం ఏమిటంటే ప్రస్తుతం సమకూరిన పెట్టుబడులతో పోస్టుమాన్ కంపెనీ వాల్యుయేషన్ ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ 15,000 కోట్లు) కు చేరుకుంది.
ఆనంద్ మహీంద్రా కూడా...
గత వారం పదిరోజుల్లో ఇండియాలో జరిగిన స్టార్టుప్ ఫండింగ్ సరళిని పరిశీలిస్తే... అందులో అధికంగా టెక్నాలజీ ఆధారితంగా పనిచేసే కంపెనీలే అధికంగా ఉండటం విశేషం. ఒకటో ... రెండో సంస్థలు మాత్రం ఇతర రంగాల్లో తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఐతే అందులో ఒకటి గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న హాప్ రాంప్ అనే ఐడియా ల్యాబ్ సేవల సంస్థ కూడా ఉంది.
ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా 1 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడం ప్రధాన వార్తగా నిలిచింది. మరోవైపు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సేవలు అందించే జీఫీ డాట్ ఏఐ కూడా మెరుగైన పెట్టుబడిని సమీకరించగలిగింది. ఈ కంపనీలోకి 18 మిలియన్ డాలర్ల (రూ 135 కోట్లు) పెట్టుబడి ప్రవహించింది. రెడ్ రైట్ పార్టనర్స్, డబ్ల్యూ 250 వెంచర్ ఫండ్ ఇందులో ఇన్వెస్ట్ చేశాయి.
ఆరోగ్య సేవలు.. అగ్రికల్చర్...
ఇటీవల ఆరోగ్య సేవలు, అగ్రికల్చర్ స్టార్టుప్ కంపెనీలకు కూడా డిమాండ్ అధికంగా ఉంటోంది. సరైన ఐడియా, ప్రణాళికతో ముందుకు వచ్చిన స్టార్టుప్ కంపెనీలకు పెట్టుబడి లభిస్తోంది. హెల్త్ ఫ్లిక్స్ అనే ఒక ఆరోగ్య సేవల స్టార్టుప్ కంపెనీకి 6 మిలియన్ డాలర్ల పెట్టుబడి లభించటం గమనార్హం. అంటే సుమారు రూ 45 కోట్లు.
ఇందులో జెఎస్డబ్ల్యూ వెంచర్స్, చిరాటే వెంచర్స్, కళారీ కాపిటల్ పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ప్రముఖ అగ్రికల్చర్ స్టార్టుప్ కంపెనీ ఐన వేకూల్ కు 5.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ 41 కోట్లు) డెట్ ఫండ్ లభించింది. దీనిని ఇండస్ ఇండ్ బ్యాంకు కు చెందిన ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్ విభాగం అందించటం విశేషం. ఇలా ఉండగా... కాలమ్ అనే మరో బెంగళూరు కేంద్రంగా పనిచేసే టెక్నాలజీ కంపెనీకి కూడా 2.75 మిలియన్ డాలర్ల (రూ 20 కోట్లు) పెట్టుబడి లభించింది. ఈ విధంగా మొత్తం 7 కంపెనీలకు మొత్తంగా రూ 1,402 కోట్ల పెట్టుబడులు లభించగా.. మరో 6 స్టార్టుప్ కంపెనీలకు లభించిన పెట్టుబడి వివరాలు వెల్లడి కాలేదు.