ప్రయాణికులా లేక దొంగలా.. రైల్వేల్లో 1.27 కోట్ల బెడ్షీట్లు మాయం.. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే..
భారతీయ రైల్వేకు చెందిన ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి వస్తువుల దొంగతనాలు భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తు ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత రైల్వే శాఖ ఉచిత బెడ్రోల్ సేవలను పూర్తిగా పునఃప్రారంభించిన కాలం నుండి.. అంటే జనవరి 2022 నుండి మే 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 1.27 కోట్లకు పైగా లినెన్ వస్తువులు అదృశ్యమయ్యాయి.
ప్రతి రాత్రి సుమారు 8 లక్షల మంది ఏసీ ప్రయాణికులకు ఈ సేవలు అందుతుండగా.. దాదాపు ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఏదో ఒక వస్తువును తమతో పాటు తీసుకుపోతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భారీ దొంగతనాల వల్ల కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ రికార్డుల ప్రకారం సుమారు రూ. 104.51 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.రైల్వే కోచ్ ల నుండి మాయమైన వస్తువుల జాబితాను పరిశీలిస్తే.. ప్రయాణికులు తమ బ్యాగుల్లో సులభంగా దాచుకోగలిగే చిన్న చిన్న వస్తువులనే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. వీటిలో అత్యధికంగా 46.54 లక్షల ఫేస్ టవల్స్ ఎత్తుకుపోయారు.

ఆ తర్వాతి స్థానాల్లో 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు, అలాగే పరిమాణంలో కాస్త పెద్దవిగా ఉండే దిండ్లు 2.76 లక్షల మేర అదృశ్యమయ్యాయి. ఈ తరహా దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతూ.. 2022 నుండి 2025 నాటికి ఈ దొంగతనాల సంఖ్య ఏకంగా 56 శాతం వృద్ధి చెందడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. దేశంలోని మొత్తం 69 రైల్వే డివిజన్లలో రాజస్థాన్కు చెందిన బికానెర్ డివిజన్ సుమారు 25.76 లక్షల వస్తువుల నష్టంతో మొదటి స్థానంలో నిలిచింది.
అక్కడ 2022లో 2.99 లక్షలుగా ఉన్న దొంగతనాలు.. 2025 నాటికి 12.34 లక్షలకు పైగా పెరిగాయి. దీని తర్వాత రాంచీ (9.31 లక్షలు), ఢిల్లీ (8.21 లక్షలు), ముంబై (8.17 లక్షలు), జోధ్పూర్ (8.09 లక్షలు) డివిజన్లు ఎక్కువ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అయితే దీనికి భిన్నంగా తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లు ఎలాంటి నష్టాలు లేకుండా సున్నా దొంగతనాలు నమోదు చేయగా.. ఢిల్లీ డివిజన్ తన పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా నష్టాలను 79 శాతం వరకు తగ్గించుకోగలిగింది.
ఈ దొంగతనాల వల్ల రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. దీని ఆర్థిక భారం నేరుగా రైల్వే శాఖపై పడదు. ఎందుకంటే బెడ్రోల్స్ సరఫరా, నిర్వహణ బాధ్యతలను బయట కాంట్రాక్టర్లు చూసుకుంటారు. కాబట్టి టెర్మినల్ స్టేషన్లలో లెక్క తేలిన కొరతను వారి బిల్లుల నుంచే రికవరీ చేస్తారు. అయితే ఈ నష్టాన్ని కాంట్రాక్టర్లు తరచూ రైళ్లలో అతి తక్కువ వేతనానికి పనిచేసే ఏసీ కోచ్ అటెండెంట్లపై నెడుతున్నారు.
ప్రయాణం ముగిసిన తర్వాత బెడ్షీట్లు లేదా టవల్స్ తక్కువైతే ఆ మొత్తాన్ని అటెండెంట్ల జీతాల నుండి మినహాయించుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ తరహా దొంగతనాలను అరికట్టడానికి రైల్వే రక్షణ దళం (RPF), రైల్వే అధికారులు ఇప్పుడు కఠినమైన చర్యలు చేపట్టారు. రైల్వే ఆస్తులను దొంగిలించడం నాన్-బెయిలబుల్ నేరమని హెచ్చరిస్తూ.. అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసేలా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అలాగే సాంకేతికతను వాడుకుంటూ కోచ్ మిత్ర యాప్ ద్వారా ప్రయాణికుల రాకపోకలను, డేటా సేకరణను అటెండెంట్లు ట్రాక్ చేస్తున్నారు. కొత్త ఏసీ కోచ్ల ప్రవేశ ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటుగా.. రైలు గమ్యస్థానానికి చేరడానికి 30 నిమిషాల ముందే ప్రయాణికుల నుండి వాడిన బట్టలను సేకరించాలనే పాత నిబంధనను ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
