మరో భారతీయుడి చేతికి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ పగ్గాలు: సీఈఓగా ముంబై వర్శిటీ స్టూడెంట్
వాషింగ్టన్: సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులు తమ హవాను కొనసాగిస్తున్నారు. విదేశీ కంపెనీలకు అధిపతులుగా ఎదుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. వాటికి దిశానిర్దేశం చేసే కీలక బాధ్యతలను అందుకుంటున్నారు. ఈ దూకుడుకు కంటిన్యూ అవుతూ వస్తోంది. భారతీయుల చేతుల్లోకి వచ్చే దిగ్గజ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. రెట్టింపు అవుతోంది. ఇప్పటికే టాప్ సెర్చ్ఇంజిన్ గూగుల్, సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఛానల్ గ్లోబల్ ముఖ్య కార్యనిర్వాహణాధిపతులుగా అత్యున్నత హోదాల్లో అపాయింట్ అయ్యారు.
పంతం నెగ్గించుకున్న ముఖేష్ అంబాని: అమెజాన్కు రూ.కోట్ల పెనాల్టీ: బిగ్బజార్కు బిగ్రిలీఫ్
వీయామ్ పగ్గాలు ఈశ్వరన్ చేతికి..
తాజాగా- మరో ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ భారతీయుల ఖాతాలో చేరింది. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ వీయామ్ పగ్గాలు భారతీయుడి చేతికి వచ్చాయి. ఆయనే ఆనంద్ ఈశ్వరన్. వీయామ్ సాఫ్ట్వేర్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అపాయింట్ అయ్యారు. ఇదివరకు ఆయన రింగ్ సెంట్రల్ సంస్థకు ప్రెసిడెంట్గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పని చేశారు. గతంలో మైక్రోసాఫ్ట్, ఎస్ఏపీ, హెచ్పీ, విగ్నెట్టె (ఓపెన్ టెక్స్ట్), బ్రాన్ (ఫెయిర్ ఇసాక్) సంస్థల్లో వేర్వేరు హోదాల్లో పనిచేశారు.
రింగ్ సెంట్రల్ టు
వీయామ్ సాఫ్ట్వేర్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అపాయింట్ అయినట్టు ఆనంద్ ఈశ్వరన్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. రింగ్ సెంట్రల్తో తనకు ఉన్న అనుబంధం ముగిసిందని వ్యాఖ్యానించారు. రింగ్ సెంట్రల్కు గుడ్బై చెబుతున్నానని పేర్కొన్నారు. రింగ్ సెంట్రల్తో తనకు ఉన్న సాన్నిహిత్యం సుదీర్ఘపాలం పాటు కొనసాగుతుందని, అక్కడ పని చేసిన జ్ఞాపకాలు తన వెన్నంటి ఉంటాయని చెప్పారు.
ముంబై వర్శిటీ పూర్వ విద్యార్థి..
వీయామ్ సాఫ్ట్వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొత్త బాధ్యతలను అందుకోనున్నానని అన్నారు. ఈ సంస్థతో కలిసి పని చేయడం పట్ల ఎగ్జయిటింగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆనంద్ ఈశ్వరన్.. ప్రతిష్ఠాత్మక ముంబై విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. ఈ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరీ-కొలంబియాలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. ప్రస్తుతం ఆయన సియాటెల్లో స్థిరపడ్డారు. మైక్రోసాఫ్ట్ సహా పలు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేశారు. ఆ అనుభవంతో రింగ్ మాస్టర్కు ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు.
లార్జెంట్ స్థానంలో..
వీయామ్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓగా విలియమ్ హెచ్ లార్జెంట్ పనిచేశారు. తాజాగా ఆయన తన హోదా నుంచి తప్పుకొన్నారు. పదవికి రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్తవారిని అపాయింట్ చేయాలని వీయామ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. దీనికోసం నిర్వహించిన ఇంటర్వ్యూ, ఇతర ప్రాసెస్లో ఆనంద్ ఈశ్వరన్ టాపర్గా నిలిచారు. ఆయనను సీఈఓగా నియమించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై వీయామ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపింది.
లిస్ట్లో టాపర్లు..
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగ్రవాల్.. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన కంపెనీలకు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేస్తోన్నారు. ఇటీవలే ఛానెల్ సీఈఓగా భారత్కే చెందిన లీనా నాయర్ నియమితులయ్యారు. ఆ వెంటనే వీయామ్ సాఫ్ట్వేర్ సైతం భారతీయుడి చేతికి సంస్థ పగ్గాలను అప్పగించింది. ఆయన సారథ్యంలో సంస్థ మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఆశిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారని తెలిపింది. ఈశ్వరన్తో కలిసి పనిచేయడం పట్ల సంతోషిస్తున్నామని పేర్కొంది.