Ambani-Adani: అంబానీ-అదానీకి ఎదురునిలుస్తున్న ప్రభుత్వ కంపెనీ.. నిలబడగలదా..?
Ambani-Adani: పాతకాలం పెట్రోల్, డీజిల్ ఇంధనాలకు కాలం చెల్లుతోంది. భారత ప్రభుత్వం ప్రజలను విద్యుత్ వాహనాలవైపు మళ్లిస్తూనే.. గ్రీన్ ఫ్యూయల్ సొల్యూషన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ నిర్ణయం పర్యావరణానికి మాత్రమే కాక భారత ఆర్థిక వ్యవస్థాకు సైతం చాలా కీలకమైనది. దేశీయ ఇంధన అవసరాలకోసం అంతర్జాతీయ మార్కెట్లపై, దేశాలపై ఆధారపడటం భారంగా మారింది. అందుకే ఖర్చుల తగ్గింపు, మార్కెట్ స్థిరత్వాన్ని తెచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
గ్రీన్ ఎనర్జీ..
వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థికానికి క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్ అందించాలని కేంద్రం యోచిస్తోంది. భవిష్యత్తులో ఈ రంగం భారీ వ్యాపారంగా మారుతుందని తెలుస్తోంది. అందుకే అదానీ, అంబానీ లాంటి ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు సైతం పోటీకి రెడీ అవుతున్నాయి. అందుకే అంబానీ, అదానీలకు పోటీగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
స్పెషల్ కంపెనీ..
దేశీయ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఇంధన వ్యాపారం కోసం ప్రత్యేకంగా మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమౌతోంది. వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలంటే కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ లతో నేరుగా పోటీపడాల్సి ఉంటుంది.
ఇండియన్ ఆయిల్..
IOC ఇప్పటికే బయో ఫ్యూయల్స్, బయోగ్యాస్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ బ్యాటరీలు మెుదలైన వ్యాపారాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా కొత్త ఉద్యోగాన్ని ఏర్పాటు చేయటం వల్ల మార్కెటింగ్, ఉత్పత్తి వేగంగా సులువుగా నిర్వహించటానికి వీలు కలగనుంది. 2027-28 నాటికి మొత్తం హైడ్రోజన్ ఉత్పత్తిలో 5 శాతం; 2029-30 నాటికి ఉత్పత్తిని 10 శాతానికి చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఈ కొత్త కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇతర వ్యాపారాలు..
ఇండియన్ ఆయిల్ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇధనాల్ తయరీ, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇంధన సెల్ టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ ద్వారా బయో డీజిల్ ఉత్పత్తి, ఎనర్జీ స్టోరేజ్ పరికరాలు, పునరుత్పాదక శక్తి వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇండియన్ ఆయిల్, జర్మనీకి చెందిన ఆయిల్ట్యాంకింగ్ GMBH వ్యాపారంలో ఇండియన్ ఆయిల్ కు చెందిన 49.3 శాతం వాటాను రూ.1,050 కోట్లకు అదానీ గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసింది.