ఇండియన్ ఐటీ రంగం (IT sector)లో గత కొన్ని రోజులుగా ప్రకంపనలు రేగుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే మన ఐటీ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 4.5 లక్షల కోట్ల రూపాయల మేర తుడిచిపెట్టుకుపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్ల ఐటీ ఉద్యోగాల కోత (Layoffs) పెరగవచ్చని వస్తున్న వార్తలు ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. నేడు (ఫిబ్రవరి 24) మార్కెట్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజాల షేర్లు భారీగా పడిపోయాయి.

భారతదేశానికి వెన్నెముకలా నిలిచే ఐటీ రంగం ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'సిత్రిణి రీసెర్చ్' నివేదిక బయటకు వచ్చినప్పటి నుండి ఐటీ షేర్ల విలువ పాతాళానికి పడిపోతోంది. ఈరోజు ఒక్క రోజే నిఫ్టీ ఐటీ సూచీ 2 శాతం మేర క్షీణించింది. ఇన్ఫోసిస్ 3%, టీసీఎస్ 2.3%, విప్రో , ఇతర కంపెనీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి. కేవలం 30 రోజుల్లోనే విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల షేర్లు 25 శాతం మేర పడిపోవడం గమనార్హం. మన దేశ జీడీపీలో 10 శాతం వాటా ఇచ్చే ఈ రంగం ఇంతగా దెబ్బతినడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద హెచ్చరిక అని నిపుణులు అంటున్నారు.
ఏఐ (AI) మాయాజాలం.. ఐటీ కంపెనీలకు శాపం?
ఐటీ కంపెనీల పతనానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటివరకు అమెరికా వంటి దేశాలు తక్కువ ఖర్చుతో పనులు అవుతాయని భారతీయ ఐటీ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల ఆ ఖర్చు కేవలం కరెంట్ బిల్లు అంత స్థాయికి తగ్గిపోయింది. పలాంటిర్ అనే సంస్థ ప్రకారం, గతంలో ఏళ్ల తరబడి పట్టే ఈఆర్పీ మైగ్రేషన్ పనులు ఇప్పుడు ఏఐ సహాయంతో కేవలం రెండు వారాల్లోనే పూర్తవుతున్నాయి. దీనివల్ల క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టులను రద్దు చేసుకుంటున్నారు. 2027 నాటికి టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల ఒప్పందాలు రద్దయ్యే వేగం మరింత పెరుగుతుందని సిత్రిణి నివేదిక హెచ్చరిస్తోంది.
ఉద్యోగాల కోత , రూపాయి పతనం
ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గితే అది నేరుగా ఉద్యోగాల కోత (Layoffs) కు దారితీస్తుంది. ఏఐ టూల్స్ వల్ల తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకునే వీలుండటంతో, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గిపోయి, ఉన్న ఉద్యోగులను తొలగించే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు ఐటీ ఎగుమతులు తగ్గడం వల్ల దేశంలోకి వచ్చే డాలర్లు తగ్గి, రూపాయి విలువ కూడా పడిపోయే అవకాశం ఉంది. గత నాలుగు నెలల్లోనే రూపాయి విలువ సుమారు 18 శాతం మేర క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
సాంప్రదాయ పద్ధతుల్లో కోడింగ్ చేసే కాలం చెల్లిపోయిందని, ఏఐని అందిపుచ్చుకోకపోతే ఐటీ కంపెనీల మనుగడ కష్టమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 200 బిలియన్ డాలర్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేసే భారత్, ఈ ఏఐ సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఐటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఈ పతనం పెద్ద షాక్ అనే చెప్పాలి. ఉద్యోగులు కూడా తమ నైపుణ్యాలను ఏఐకి తగ్గట్టుగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.


Click it and Unblock the Notifications