భారత ఐటీ రంగం: 50% పతనం, అసలు కారణం ఇదే!
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ఐటీ సేవల రంగం చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్లోబల్ రెసిషన్ (ప్రపంచ ఆర్థిక మాంద్యం) నాటి పరిస్థితులను తలపించేలా.. భారత ఐటీ కంపెనీల వ్యాపార వృద్ధి, షేర్ల విలువ భారీగా పతనమయ్యాయి.
ఇటీవల యాక్సెంచర్ (Accenture) విడుదల చేసిన రెవెన్యూ అంచనాలు భారత ఐటీ కంపెనీలను కుదిపేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవల వల్ల కొత్త బిజినెస్ రావడంలో జాప్యం జరుగుతోందని ఆ సంస్థ బహిరంగంగానే ప్రకటించింది. ఒకవేళ కొత్త ప్రాజెక్టులు వచ్చినా, వాటి లాభాలు ప్రస్తుత బిజినెస్ మోడల్కు సరిపోవట్లేదని స్పష్టం చేసింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో, గత రెండేళ్లుగా దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు ఐటీ స్టాక్స్ నుంచి భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీని ఫలితంగా, దేశంలోని టాప్ ఐటీ కంపెనీల షేర్లు తమ 52 వారాల గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 50 శాతం వరకు పడిపోయాయి.
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఐ మైండ్ట్రీ వంటి దిగ్గజాల షేర్లు తమ ఆల్టైమ్ గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 50 శాతం పతనమయ్యాయి.

దీంతో టాప్-10 ఐటీ కంపెనీల మార్కెట్ విలువ వాటి గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 19.28 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. అంతేకాదు, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రస్తుతం 2020 నాటి కనిష్ట ధరల వద్ద ట్రేడ్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఉదాహరణకు, టీసీఎస్ షేరు ఆగస్టు 30, 2024న రూ. 4592.25 వద్ద ట్రేడ్ అవ్వగా, ప్రస్తుతం 56 శాతం పతనమై రూ. 2033 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒక్క టీసీఎస్ మాత్రమే సుమారు 9.12 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయింది.
అదేవిధంగా, విప్రో షేరు రూ. 370 నుంచి 54% క్షీణించి రూ. 170కి చేరింది. LTM షేరు ధర రూ. 7589 నుంచి 53% పడిపోయి రూ. 3543కి దిగొచ్చింది. ఇన్ఫోసిస్ 50% నష్టంతో రూ. 2006 నుంచి రూ. 1006కి, హెచ్సీఎల్ టెక్ రూ. 2012 నుంచి రూ. 1072కి పడిపోయాయి.
భారత ఐటీ రంగం పతనానికి ప్రధాన కారణం.. ఏఐ టెక్నాలజీ వృద్ధి, దానికి తోడు ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో నెలకొన్న స్థూల ఆర్థిక (Macroeconomic) సంక్షోభం. ఈ కారణాల వల్ల కొత్త ప్రాజెక్టులు, బిజినెస్ పొందడంలో కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications
