Upcoming IPO Season: ఈ ఏడాది వానాకాలం ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురవనుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.
వివరాల్లోకి వెళితే.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్తో సహా దాదాపు 56 కంపెనీలు తమ ఐపీవో, ఎఫ్పీవో ద్వారా రూ.90,000 కోట్లకు పైగా సమీకరించాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సుమారు 17 కంపెనీలు తమ ఐపీవోలను ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) నుంచి అనుమతి పొందాయి.

ఈ కంపెనీల్లో ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ఒక్కొక్కటి సుమారు రూ.1,500 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నాయి. వీటికి తోడు దాదాపు 38 ప్రైమ్ కంపెనీలు జూన్ 7 వరకు SEBIకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని దాఖలు చేసి తగిన అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి.పెద్ద ఐపీవోల జాబితాలో స్విగ్గీ రూ.8,000 కోట్లు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.7,000 కోట్లు, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.7,000 కోట్లు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ.5,500 కోట్లు, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఉన్నాయి. .
బలమైన ఫండమెంటల్స్, పెద్ద రిటైల్ భాగస్వామ్యం భారతదేశ బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలు, పెద్ద రిటైల్ భాగస్వామ్యం ఐపీవో మార్కెట్ను నడిపిస్తున్నాయని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు వి జైశంకర్ అన్నారు. పెరిగిన ప్రభుత్వ వ్యయం, అనుకూలమైన రుతుపవనాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతుందని అంచనా వేయడంతో వృద్ధి ఎజెండా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ దేశీయ ఇన్వెస్టర్లు ఐపీవోల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications