household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
household income: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం కుటుంబాలు ఆదాయం, పొదుపులో క్షీణతను ఎదుర్కొంటున్నాయని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. 56 శాతం పొదుపులో తగ్గుదలని ప్రస్తావించగా.. సగం కంటే ఎక్కువ కుటుంబాలు ఆదాయంలో క్షీణతను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది.
మరో ఏడాది వరకు ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుందని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం, పొదుపుల్లో భారీ తగ్గుదల ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా 25 శాతం కుటుంబాలు ఆదాయం పెరిగినట్లు, 7 శాతం మందికి ఎటువంటి మార్పు లేనట్లు చెప్పారు.
కరోనానే కారణం
కొవిడ్ సంక్షోభ కారణంగా తక్కువ ఆదాయం, అధిక ఖర్చుల వల్ల భారతీయ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నట్లు సర్వే పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి సైతం ఏడాదిగా పరిస్థితులు సహకరించలేదని వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మీద ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలిపింది.
ఎందుకీ సర్వే ?
కూరగాయలు, పప్పులు, నూనె, పాలు సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినందున.. భారతీయ కుటుంబాల ఆదాయం, పొదుపులను అర్థం చేసుకోవడానికి లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించింది. తమ ఇంటి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు ప్రజలు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది.
కారణాలనేకం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పలు దేశీయ, అంతర్జాతీయ అంశాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగినట్లు పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోవడం, లే ఆఫ్ లు మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభించే కరువు భత్యం సహా ఇతర అలవెన్సులు ప్రైవేట్ వారికి అందవు కాబట్టి పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో కుటుంబ ఆదాయాలు సరితూగవని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.