FASTag: టోల్ ప్లాజాలకు కాలం చెల్లింది.. ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లింపు.. ఇకపై NO వెయిటింగ్..
GPS Based Toll: టోల్ టిక్కెట్ కొనుక్కోవటం, ఫాస్టాగ్ వినియోగించి టోల్ చెల్లింపులకు కాలం చెల్లుతోంది. ఇకపై కేవలం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించండి. GPS ఆధారిత టోల్ వసూలు త్వరలో దేశవ్యాప్తంగా అమలులోకి వస్తోంది. ఈ విధానం ప్రకారం మీ కారు హైవేపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతకు మాత్రమే టోల్ చెల్లించవలసి ఉంటుంది. దీని వల్ల అనవసర చెల్లింపుల నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది.
ఫాస్ట్ట్యాగ్ విధానానికి కాలం చెల్లనుంది..
ఫాస్ట్ట్యాగ్ త్వరలో గతానికి సంబంధించిన అంశంగా మారనుంది. ప్రభుత్వం టోల్ కలెక్షన్ కోసం దేశవ్యాప్తంగా కొత్త సాంకేతికతను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏకంగా జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపధికన దీనిని దేశంలో అమలు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 1.37 లక్షల ఆటోమొబైల్స్ పై కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. రష్యా, దక్షిణ కొరియా నిపుణులు దీనిపై నివేదికను తయారు చేస్తున్నారు.
ప్రయాణించిన దూరానికే..
మీ వాహనం దేశంలోని ఏదైనా హైవే లేదా ఎక్స్ప్రెస్వే పైకి వచ్చినప్పుడు ఆటోమెటిక్ గా ప్రయాణించిన కిలోమీటర్లకు టోల్ లెక్కించటం ప్రారంభమవుతుంది. ఈ నూతన వ్యవస్థకు సంబంధించిన వివరాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. మార్చి నెలలో లోక్సభలో వెల్లడించారు. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్లను ప్రభుత్వం తొలగిస్తుందని కూడా అప్పట్లో ప్రకటించారు. కదులుతున్న వాహనాలపై జీపీఎస్ ఇమేజింగ్ ద్వారా టోల్ వసూలు చేస్తామని ఆయన తెలిపారు.
ఏఏ దేశాల్లో అమలవుతోందంటే..
ఇప్పటికే ఈ సాంకేతికత కొన్ని అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల్లో అమలులో ఉంది. అక్కడ ఇది విజయవంతం కావటంతో భారత్లోనూ దీనిని అనుసరించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇదే వ్యవస్థ జర్మనీలోని 99 శాతం కార్లలో ఇదే సాంకేతికత అమర్చినందున అక్కడ కూడా ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. టోల్ చెల్లింపుల నుంచి తప్పించుకోకుండా ఇది నివారిస్తుందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.