భారత ఆర్థికవ్యవస్థ -10.5%, ఫిచ్ రేటింగ్ భారీ కోత
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత జీడీపీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసింది. రానున్న రెండు క్వార్టర్లలోను ప్రతికూలత నమోదు కావొచ్చునని, నాలుగో క్వార్టర్లో మాత్రం కాస్త పుంజుకోవచ్చునని ఇప్పటికే ఆర్థిక నిపుణులు, రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. దాదాపు 10.5 శాతం మేర కుంచించుకుపోనుందని అంచనా వేసింది.
అందుకే భారీ కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతం ప్రతికూలత నమోదు కావొచ్చునని గతంలో ఇదే ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఇప్పుడు దానిని సవరించి గత అంచనాలతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మహమ్మారి కేసులు పెరగడం, దాని ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మరింత కోత విధించింది.
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ప్రపంచంలోనే అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్ ఒకటి అని తెలిపింది. జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి విడుదల చేసిన గ్లోబల్ ఎకనమిక్ ఔట్ లుక్లో ఈ విషయాలు వెల్లడించింది.
ఆదాయాలు పడిపోయాయి
బ్రిటన్, స్పెయిన్, భారత్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. కరోనా కేసుల సంఖ్య పెరగడం, దీంతో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇది ఆర్థికవ్యవస్థని ప్రభావితం చేసిందని తెలిపింది. సాధారణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్రజల ఆదాయాలు పడిపోయాయని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం, 2022-23లో ఆరు శాతం వృద్ధి రేటు నమోదు కానుందని తెలిపింది.
మిగతా త్రైమాసికాల్లో ఫిచ్ అంచనా
ఫిచ్ అంచనాల ప్రకారం జూలై-సెప్టెంబర్లో జీడీపీ మైనస్ 9.6 శాతం, అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో మైనస్ 4.8 శాతం, జనవరి-మార్చి మధ్య 4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఉండవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం 11 శాతం, ఆ తర్వాత ఆరు శాతం వృద్ధి రేటు ఉండవచ్చునని అంచనా వేసింది.