మాస్టర్ ప్లాన్తో లాభపడుతున్న భారత్.. రష్యాతో జతకట్టి ఇలా..!!
Crude Imports: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ తన ఇంధన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే అధారపడుతోంది. ఈ క్రమంలో విలువైన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవటం కోసం సరసరమైన ధరలకు రష్యా నుంచి కొనుగోళ్లు మెుదలెట్టింది.
ఈ క్రమంలో భారత్ ఒపెక్ దేశాల నుంచి చమురు దిగుమతులను భారీగా తగ్గించిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. చవకైన రష్యన్ చమురు కొనుగోళ్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారతదేశ చమురు దిగుమతుల్లో చమురు ఉత్పత్తిదారుల కార్టెల్ ఒపెక్ వాటా ఏప్రిల్లో ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయి 46 శాతానికి పడిపోయిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో 90 శాతం వరకు OPEC ఉత్పత్తి చేసినదే ఉండేది.
భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతుకు పైగా సరఫరా చేయడం ద్వారా వరుసగా ఏడవ నెల కూడా రిఫైనరీల్లో పెట్రోలు, డీజిల్గా మార్చబడిన ముడి చమురు ఏకైక అతిపెద్ద సరఫరాదారుగా రష్యా కొనసాగింది. ప్రస్తుతం భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు ఇరాక్, సౌదీ అరేబియా నుంచి సంయుక్త కొనుగోళ్ల కంటే ఎక్కువగా నిలిచాయి.
అధిక సరుకు రవాణా ఖర్చుల కారణంగా గతంలో భారతీయ రిఫైనర్లు రష్యన్ చమురును చాలా అరుదుగా కొనుగోలు చేసేవి. అయితే.. Vortexa అందించిన సమాచారం ప్రకారం భారత్ మార్చి 2022లో రష్యా నుంచి కేవలం 68,600 bpd చమురును దిగుమతి చేసుకుంది. ఈ సంవత్సరం కొనుగోళ్లు 1,678,000 bpdకి పెరిగాయి. డిసెంబరులో యూరోపియన్ యూనియన్ దిగుమతులను నిషేధించిన తర్వాత దాని ఇంధన ఎగుమతులలో అంతరాన్ని పూడ్చేందుకు రష్యా భారతదేశానికి రికార్డు స్థాయిలో ముడి చమురును విక్రయిస్తోంది.