Ratan Tataను వరించిన ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం.. ఎల్లలు దాటికి కీర్తి..
Ratan Tata: భారత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వారిలో రతన్ టాటా కూడా ఒకరని మనందరికీ తెలుసు. వ్యాపార సామ్రాజ్యంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ శత్రువులు లేని ఏకైక నాయకుడు సర్ రతన్ టాటా. దేశాభివృద్ధే పరమావదిగా వ్యాపారాలను నిర్వహిస్తున్న సంస్థ టాటా గ్రూప్.
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లభించింది. భారత్లోని ఆస్ట్రేలియన్ రాయబారి బారీ ఓ ఫారెల్ దీనికి సంబంధించిన వివరాలను ట్వీట్ ద్వారా వెల్లడించారు. వ్యాపార దిగ్గజం, దాతృత్వం ఉన్న నాయకుడని ప్రశంసించారు. టాటా సహకారం ఆస్ట్రేలియాలో గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియా-భారత్ బంధంలో రతన్ టాటా సుదీర్ఘకాలంగా చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రదానం చేయడం ఆనందంగా ఉందని బారీ ఓ' ఫారెల్ ట్విట్టర్లో వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు.. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, దాతృత్వానికి అందించిన సేవలకు ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా జనరల్ విభాగంలో గౌరవ అధికారిగా రతన్ టాటా నియమితులయ్యారు.

రతన్ టాటాకు దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు దక్కటంపై టాటా పవర్ సదరన్ ఒడిషా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ రంజన్ అభిప్రాయపడ్డారు. అనేక విజయవంతమైన వెంచర్ల వెనుక రతన్ టాటా చోదక శక్తిగా నిలిచారని పేర్కొన్నారు. భారత టైకూన్ రతన్ టాటా ఇలాంటి అరుదైన గౌరవాన్ని పొందటంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications