Gautam Adani: కొండలా పెరుగుతున్న అదానీ సంపద.. రోజువారీ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాంకే..
Gautam Adani: గౌతమ్ అదానీ ఈయన రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ వ్యాపార ప్రపంచంలో అందరి మతి పోగొడుతున్నారు. అంచనాలకు చిక్కకుండా తన సంపదను కొండలా పెంచుకుంటూ పోతున్నారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న ఈ భారత వ్యాపారవేత్త సంపద రేసుగుర్రంలా దూసుకుపోతోంది.
IIFL నివేదిక..
IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 డేటా ప్రకారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద గత ఏడాది కాలంగా ప్రతిరోజూ రూ.1,612 కోట్ల మేర పెరిగింది. ఈ వేగంతో అదానీ గడచిన సంవత్సర కాలంలో అంబానీని వెనక్కు నెట్టి దేశంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద అంబానీ కంటే దాదాపు రూ.3 లక్షల కోట్లు ఎక్కువగా ఉంది. అలా ఈ కాలంలో అదానీ సంపద రూ.5,88,500 కోట్లు పెరిగి మొత్తం ఆస్తి విలువ రూ.10,94,400 కోట్లకు చేరుకుంది.
అదానీ కుటుంబం..
పారిశ్రామికవేత్త అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్నారు. ఏప్రిల్లో ఆయన సెంటిబిలియనీర్ అయ్యారు. గౌతమ్ అదానీ, కుటుంబం సంపద ఐదేళ్లలో ఏకంగా 15.4 రెట్లు పెరిగింది.
60 ఏళ్ల వయస్సులో..
గౌతమ్ అదానీ 60 ఏళ్ల వయస్సులో భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ గ్రూప్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన సామ్రాజ్యంలో 7 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, రియల్ ఎస్టేట్, మీడియా, సిమెంట్, రిటైల్, గ్రీన్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అనేక కొత్త కంపెనీలను చేజిక్కించుకుంటున్నారు. నెలల వ్యవధిలో ప్రపంచ వ్యాపారుల్లో సంచలనంగా మారారు అదానీ.
సిమెంట్ వ్యాపారంలో సంచలనంగా..
ఇటీవల సిమెంట్ మార్కెట్ పై కన్నేసిన అదానీ చరిత్రలో భారీ డీల్ చేసుకున్నారు. ఈ క్రమంలో అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీని కొనుగోలు చేశారు. రానున్న కాలంలో మరో రెండు కంపెనీలను సైతం అదానీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హోల్సిమ్ కొనుగోలుతో..
దేశంలో స్విస్ దిగ్గజం హోల్సిమ్ సిమెంట్ వ్యాపారాన్ని మే 2022లో 10.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి రేస్ మెుదలెట్టారు. అలా సిమెంట్ రంగంలోకి విస్తరించారు. దీనికి తోడు గ్రీన్ ఎనర్జీ రంగంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై 70 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు.
వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్..
IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 టాప్- 10లో వివిధ రంగాల నుంచి వచ్చినవారు ఉన్నారు. గౌతమ్ అదానీ - అత్యంత ధనవంతుడు, పవర్, పోర్ట్, పునరుత్పాదక ఎనర్జీపై ఆసక్తి కలిగి ఉన్నారు. టెలికాం, పెట్రో కెమికల్స్లో రెండో ర్యాంక్లో ముఖేష్ అంబానీ ఉన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ రారాజుగా గుర్తింపు పొందిన సైరస్ పూనావాలా మూడో స్థానంలో ఉన్నారు. తర్వాత టాప్- 10లో ఫార్మా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలను నిర్వహిస్తున్న బిజినెస్ మెన్స్ ఉన్నారు.