దుబాయ్ బంగారంపై దిమ్మదిరిగే న్యూస్.. ప్రమాదంలో భారత పసిడి సరఫరా.. స్తంభించిపోయిన యూఏఈ గోల్డ్ కోట్..
భారతదేశపు బంగారం సరఫరా ప్రమాదంలో ఉందా..తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుండి భారత దేశానికి జరిగే బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త కోటాను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం యూఏఈ నుండి దిగుమతి చేసుకునే అర్హత గల బంగారంపై 1 శాతం దిగుమతి సుంకం మినహాయింపు లభిస్తుంది.
అయితే ఈ కోటా కేటాయింపు ప్రక్రియపై ప్రస్తుతం కోర్టులో న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాత కోటా చెల్లుబాటు గడువును ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. దేశంలో కరెంట్ ఖాతా లోటుకు గణనీయంగా దోహదపడే అనవసరపు బంగారం దిగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం వేస్తున్న ముందస్తు అడుగుల్లో భాగంగానే ఈ ఆలస్యం జరుగుతోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

ఈ జాప్యం కారణంగా ప్రస్తుతం మార్కెట్లో బంగారం దిగుమతి లైసెన్సులు లభించడం అత్యంత అరుదుగా మారిందని అల్ హయాత్ ఓవర్సీస్ ట్రేడింగ్ వ్యవస్థాపకుడు అమిత్ గుప్తా వెల్లడించారు. ట్రేడర్స్ రిప్రజెంటేటివ్ కోటా (TRQ) ఇంకా జారీ కాకపోవడంతో బంగారం దిగుమతిదారులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT), ఇతర ప్రభుత్వ ఏజెన్సీలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అయినప్పటికీ, కొత్త విధానం ఇంకా ఖరారు కాకపోవడంతో మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. మరోవైపు ఈ పరిస్థితి వల్ల తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని.. డిమాండ్ ఉన్న సమయంలో సరుకు సరఫరా చేయలేక ఎగుమతులు నిలిచిపోయాయని అశోక గ్లోబల్ వ్యవస్థాపకుడు మోనల్ థక్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అనిశ్చితి ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజ్ (IIBX) ద్వారా జరిగే వర్తకాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రస్తుతం కొంతమంది దిగుమతిదారుల వద్ద గత gold కేటాయింపుల చక్రం నుండి మిగిలిపోయిన కోటా ఉన్నప్పటికీ.. అది అనేక మంది చిన్న వ్యాపారుల మధ్య విడిపోయి ఉంది. దీనివల్ల 100 కిలోల వంటి పెద్ద ఆర్డర్లను ఒకేసారి పూర్తి చేయడం సాధ్యపడటం లేదు. 10 కిలోల బంగారాన్ని 20 మంది వేర్వేరు కొనుగోలుదారులకు విభజించి అమ్మడం వ్యాపార రీత్యా లాభదాయకం కాదని.. దీనికంటే ఐఐబీఎక్స్ ద్వారా సింగిల్ ఆర్డర్ పూర్తి చేయడమే శ్రేయస్కరమని వర్తకులు పేర్కొంటున్నారు.
దిగుమతి ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి నిర్దేశిత బ్యాంకులు, ఐఐబీఎక్స్ ద్వారా బంగారం దిగుమతి చేసుకునే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కొత్త gold కోటా కేటాయింపులో ఇలాగే జాప్యం కొనసాగితే చట్టబద్ధమైన డిమాండ్ క్రమంగా అధికారిక మార్గాల నుండి బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది బులియన్ మార్కెట్లో అనధికారిక లావాదేవీలు, అక్రమ వ్యాపారం పెరగడానికి దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications
