US Dollar: గ్లోబల్ చెల్లింపుల్లో అగ్రగామిగా చెలామణి అయిన అమెరికా డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతోంది. డిజిటల్ ప్రపంచం వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో అమెరికాను ఢీకొట్టేందుకు చాలా దేశాలు సన్నాహాలు ప్రారంభించాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యమైన సమస్యగా డాలర్ నిలిచింది. విదేశీ దిగుమతుల చెల్లింపులకు 100 శాతం డాలర్ వినియోగం ఆర్థికంగా భారాన్ని కలిగిస్తోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా డాలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం దిగుమతులను ఖరీదుగా మారుస్తోంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటానికి యూఎస్ వడ్డీ రేట్లను పెంచుతూ డాలర్ల చలామణిని తగ్గిస్తోంది. దీంతో డాలర్ విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే విపరీతంగా పెరుగుతోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధికి ఇది పెద్ద భారంగా మారింది.

ఈ విషయంలో రష్యా ప్రభుత్వం వేసిన విత్తనం పెద్ద చెట్టుగా మారింది. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు, గల్ఫ్ దేశాల్లో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి డీ-డాలరైజేషన్ విధానం విస్తృతంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకు తమ తమ దేశాల స్థానిక కరెన్సీలను ఉపయోగించడం కోసం ఒక ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
తాజా ఒప్పందం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్ చేసుకుంటున్న ముడి చమురు కొనుగోళ్లకు రానున్న కాలంలో భారతీయ రూపాయిలలో చెల్లింపులు జరిపేందుకు వెసులుబాటు కలగుతోంది. అలాగే యూఏఈ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులు, ఔషధాల కోసం డాలర్లకు బదులుగా దిర్హామ్లలో చెల్లించనుంది. ఈ ఒప్పందంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖలీద్ మహ్మద్ పలామా సంతకాలు చేశారు. ప్రధాని యూఏఈ పర్యటనలో తాజా పరిణామం చోటుచేసుకుంది. శ్రీలంక సైతం రూపాయిని డాలర్ బదులుగా మారకానికి వినియోగించవచ్చని భావిస్తోంది.


Click it and Unblock the Notifications