సౌదీ అరేబియాపై ఆధారపడవద్దు! చమురుపై భారత్ కీలక నిర్ణయం
సౌదీ అరేబియా నుండి భారత చమురురంగ సంస్థలు 36 శాతం తక్కువ చమురును కొనుగోలు చేయనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయించింది. మే నెల నుండి ఈ తగ్గుదల ఉండవచ్చు. కరోనా నేపథ్యంలో గత ఏడాది చమురు ధరలు భారీగా పడిపోయాయి. కరోనా కేసులు తగ్గడంతో క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్యారెల్ చమురు 70 డాలర్లను కూడా తాకింది. ఇప్పుడు 65 డాలర్లకు అటు ఇటుగా ఉంది. దీంతో దేశీయంగా కూడా చమురు ధరలు పెరగడం లేదు.
దిగుమతి తగ్గించాలని...
సౌదీ అరేబియా నుండి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవడంపై భారత్ దృష్టి సారించడం ఇందుకు నేపథ్యం. కరోనా కేసులు తిరిగి పెరగడం, దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉన్నందున మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందని భావిస్తోంది.
మాట వినని సౌదీ
IOCతో పాటు ఇతర రిఫైనరీస్ సౌదీ అరేబియా నుండి నెలవారీగా చేసుకునే చమురు దిగుమతుల్లో సగటున 65 శాతం మాత్రమే మే నెలకు ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ముడిచమురు ఉత్పత్తి పెంచి, ధరలు తగ్గేలా చూడమని భారత్ కోరినప్పటికీ సౌదీ అరేబియా వినడం లేదు. దీంతో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి కోతలపై ఆంక్షలు ఎత్తివేయడంపై సౌదీ అరేబియా నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గత నెలలో ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచించింది.
స్పాట్ మార్కెట్
సౌదీ సహా ఇతర దేశాలతో స్థిర పరిమాణ కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి బదులు స్పాట్ లేదా కరెంట్ మార్కెట్ నుండి ఎక్కువ చమురు కొనుగోలు చేయాలని ఐవోసీ, ఇతర కంపెనీలు భావిస్తున్నాయని తెలుస్తోంది. అప్పుడు స్పాట్ మార్కెట్లో ధరలు పడిపోతే ఆ ప్రయోజనం పొందవచ్చు. దశాబ్ద క్రితంతో పోలిస్తే స్పాట్ కొనుగోళ్లను 20 శాతం నుండి 35 శాతానికి పెంచుకున్నాయి. ఏప్రిల్ 2020 నుండి ఫిబ్రవరి 2021 వరకు ఒపెక్ నుండి భారత్లోకి దిగుమతులు 74.4 శాతానికి తగ్గాయి.