కొత్త కరోనా: బ్రిటన్ నుండి భారత్కు విమానాలు రద్దు
ఢిల్లీ: బ్రిటన్లో కొత్త రకం కరోనా మహమ్మారి వెలుగు చూసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశం నుండి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 22వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు లండన్ నుండి భారత్కు లేదా భారత్ నుండి లండన్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది.
యూకే నుండి డిసెంబర్ 22 అర్ధరాత్రి లోపు భారత్కు వచ్చే ప్రయాణీకులు విమానాశ్రయాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని సూచించింది. బ్రిటన్లో కొత్త రకం కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. దీంతో ఐరోపా సహా ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి.
పలు దేశాలు ఇప్పటికే బ్రిటన్కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. అయితే కొత్త రకం వైరస్తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని భారత ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అలాగే, కరోనా పుట్టుక, వ్యాప్తిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నేడు కీలక సమావేశం నిర్వహించింది.