Gold Price: పెళ్లిళ్ల సీజన్లో చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేట్లు.. బడ్జెట్ తగ్గించుకోవాలంటే ఇలా చేయండి!
భారతదేశంలో పెళ్లి అంటేనే బంగారం. సంప్రదాయం, గౌరవం, ఆర్థిక భద్రత.. ఇలా అన్నింటికీ బంగారమే ప్రామాణికం. కానీ, ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల బంగారం ధరలు (Gold rates) ధరలు తులం (10 గ్రాములు) రూ. 1.5 లక్షల దిశగా పరుగులు తీస్తున్నాయి. కేవలం రెండేళ్ల క్రితం రూ. 50 వేల స్థాయిలో ఉన్న ధరలు ఇప్పుడు మూడు రెట్లు పెరగడంతో, మధ్యతరగతి కుటుంబాలు తమ పెళ్లిళ్ల బడ్జెట్ను రీ-ప్లాన్ చేసుకుంటున్నాయి.

తగ్గుతున్న గ్రాములు.. మారుతున్న ట్రెండ్
ధరలు పెరిగినా పెళ్లిళ్లలో బంగారం వాడకం తగ్గలేదు కానీ, కొనుగోలు చేసే విధానం మారింది. గతంలో ఎన్ని గ్రాముల నగలు చేయించాం అనేది ముఖ్యం. కానీ ఇప్పుడు 'లైట్ వెయిట్' (తక్కువ బరువు) నగలకు డిమాండ్ పెరిగింది.
- పాత బంగారం మార్పిడి: కొత్త నగలు కొనే బదులు, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని మార్పిడి (Old-gold exchange) చేసే వారి సంఖ్య 40% కి పెరిగింది.
- హెయిర్లూమ్ జ్యువెలరీ: అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి పాత నగలనే ఆధునిక హంగులతో రీ-డిజైన్ చేయించుకుని వధువులు వాడుతున్నారు.
- ఆర్టిఫిషియల్ & రెంట్: భారీ సెట్లు కనిపించడానికి ఇమిటేషన్ జ్యువెలరీని లేదా అద్దెకు తీసుకున్న నగలని అసలు బంగారంతో కలిపి వాడుతున్నారు.
మధ్యతరగతిపై భారమెంత?
రూ. 50-70 లక్షల బడ్జెట్తో పెళ్లి చేసే మధ్యతరగతి కుటుంబాల్లో బంగారం వాడకం సుమారు 20-25% తగ్గిందని వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. గతంలో 200 గ్రాముల బంగారం కొనేవారు ఇప్పుడు అదే బడ్జెట్లో 120-150 గ్రాములతోనే సరిపెట్టుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా డైమండ్స్, పోల్కీ , వెండి నగలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
పంచాయతీ ఆంక్షలు - షాకింగ్ రూల్స్!
బంగారం ప్రదర్శన వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని ఉత్తరాఖండ్లోని కొన్ని గ్రామాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పెళ్లిళ్లలో మహిళలు కేవలం ముక్కుపుడక, చెవి రింగులు, మంగళసూత్రం మాత్రమే ధరించాలని జౌన్సార్ రీజియన్ పంచాయతీ నిబంధన పెట్టింది. ఈ రూల్ అతిక్రమిస్తే రూ. 50,000 జరిమానా కూడా విధిస్తున్నారు. సామాజిక సమానత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు.
ఇన్వెస్ట్మెంట్ మార్గంగా గోల్డ్
ప్రస్తుతం బంగారం (Gold) కేవలం అలంకార వస్తువు కాదు, ఒక పక్కా ఫైనాన్షియల్ ప్లానింగ్. చాలా కుటుంబాలు పెళ్లికి నెలల ముందు నుంచే ఈఎంఐ (EMI) స్కీమ్లు, ఫిక్స్డ్ రేట్ బుకింగ్స్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఎంత పెరిగినా భారతీయుల సెంటిమెంట్ మాత్రం తగ్గలేదు. గ్రాములు తగ్గినా, ఆభరణాల మెరుపు మాత్రం తగ్గకుండా స్మార్ట్ ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు.
మొత్తంగా చూస్తే.. భారతదేశపు 'బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్' ఇప్పుడు 'స్మార్ట్ వెడ్డింగ్స్'గా మారుతున్నాయి. బంగారం బరువు తగ్గినా, దాని విలువ , ప్రాముఖ్యత మాత్రం భారతీయుల మనసుల్లో అలాగే ఉంది.


Click it and Unblock the Notifications