power: దేశంలో పెరుగుతున్న పారిశ్రామికీకరణ వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి సైతం పరుగులు పెడుతోంది. కానీ డిమాండ్ కు తగిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది. వేసవి ప్రారంభానికి ముందే కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కరెంటు వాడకం చూస్తుంటే.. రానున్న రోజులను తలచుకుంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంకా నెల మిగిలుండగానే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరిలో విద్యుత్ వినియోగం 10 శాతం పెరిగి, 1,375.57 బిలియన్ యూనిట్లు(BU)గా నమోదైంది. 2021-22 పూర్తి ఏడాది మొత్తం వాడకం 1,245 BUలను ఇప్పటికే దాటిపోయింది. ఇంకా నెల మిగిలి ఉండగానే దాదాపు 125 BUల అధికంగా వినియోగించడం జరిగింది. ఈ గణాంకాలు ప్రస్తుతమున్న డిమాండ్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అతి త్వరలో వేసవి రానుండగా.. డిమాండ్ లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పూర్తి సామర్థ్యంతో నడపాలి
ఈ ఏడాది ఏప్రిల్ లో అత్యధికంగా 229 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఎక్కువ కానున్నట్లు సంబంధిత శాఖ అంచనా వేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 215 గిగావాట్లు అధికమని పేర్కొంది. డిమాండ్ ను చేరుకోవడానికి వివిధ ప్రయత్నాలు సైతం ముమ్మరం చేసింది. పవర్ కట్స్ ప్రకటించొద్దని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మార్చి 16 నుంచి 3 నెలల పాటు పూర్తి సామర్థ్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నడపాలని ఆదేశాలు జారీ చేసింది.

డిమాండ్ ఫుల్ కానీ ఉత్పత్తి మాత్రం..
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న మొత్తంతో పాటు బొగ్గు దిగుమతులు సైతం పెంచమని థర్మల్ విద్యుత్ కేంద్రాలను విద్యుత్ శాఖ కోరింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రానున్న రోజుల్లో వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్ సైతం భారీ స్థాయిలో ఉండనున్నట్లు నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు.
వీటికి తోడు ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సైతం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తద్వారా ఏసీలు, ఎయిర్ కూలర్ల వినియోగమూ పెరగనుందని భావిస్తున్నారు. ఏప్రిల్ నుంచి డిమాండ్ కు తగిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఛాలెంజ్ తో కూడుకున్నదిగా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications