వంట గ్యాస్ కొరత రాకుండా భారత్ మాస్టర్ ప్లాన్.. హార్ముజ్లో యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇండియా కీలక అడుగు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిముఖ్యమైన హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం నిలిచిపోవడంతో భారత్ అప్రమత్తమైంది. భారత్ దిగుమతి చేసుకునే ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)లో సుమారు 90 శాతం వాటా ఈ కీలక జలమార్గం గుండానే రవాణా అవుతుండటంతో.. దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని తమ గరిష్ఠ సామర్థ్యానికి పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రిఫైనరీలకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆగస్టు 13 నాటి నోటిఫికేషన్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశం తన మొత్తం ఎల్పీజీ వినియోగంలో దాదాపు మూడింట రెండు వంతుల అవసరాలకు విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అయితే యుద్ధం కారణంగా సంప్రదాయ సరఫరా మార్గాలకు అంతరాయం కలగడంతో.. భారత్ ఇప్పటికే అమెరికా, అల్జీరియా వంటి కొత్త సరఫరాదారుల వైపు మళ్లింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించేందుకు దేశీయంగా సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమయ్యే అన్ని చర్యలను తక్షణమే అమలు చేయాలని రిఫైనరీలు, ముడి చమురు అన్వేషకులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా నాఫ్తా వంటి పెట్రోకెమికల్ ఫీడ్స్టాక్లను సాధారణ అవసరాలకు వాడకుండా.. వాటిని ఎల్పీజీ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలనే వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది.

యుద్ధ వాతావరణానికి ముందు భారత్లోని రిఫైనరీలు రోజుకు సుమారు 36 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేసేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్ను తట్టుకోవడానికి కంపెనీలు ఇప్పటికే ఈ ఉత్పత్తిని రోజుకు 54 వేల టన్నులకు పెంచాయి. అయితే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన నూతన నిబంధనల ప్రకారం దేశీయ చమురు పరిశ్రమ రోజుకు ఏకంగా 63,810 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పుంజుకోవాలని లక్ష్యంగా విధించింది. ఈ జాతీయ లక్ష్యంలో ప్రధాన వాటాగా.. ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన దేశీయ విభాగానికి రోజుకు అత్యధికంగా 18 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు.
అదేవిధంగా ప్రభుత్వ రంగ చమురు అన్వేషక సంస్థలైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL), జాతీయ గ్యాస్ పైప్లైన్ దిగ్గజం గెయిల్ (GAIL) ఇండియా లిమిటెడ్లు కూడా ఈ మొత్తం లక్ష్యంలో సుమారు పదో వంతు ఉత్పత్తిని అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా గ్యాసోలిన్, పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్తో పోలిస్తే ఎల్పీజీ ఉత్పత్తి వల్ల వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగానే భారతదేశం ఇప్పటివరకు స్వదేశీ ఉత్పత్తి కంటే చౌకగా లభించే విదేశీ దిగుమతులపైనే ఎక్కువ ఆధారపడేది. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశీయ ఇంధన భద్రతను ప్రమాదంలోకి నెట్టడంతో ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంది.
కేవలం ఉత్పత్తి పెంచడమే కాకుండా, పెరుగుతున్న గ్యాస్ నిల్వలను సురక్షితంగా ఉంచడానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తరలించడానికి అవసరమైన రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలని కూడా రిఫైనరీలకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన కఠిన కాలపరిమితులకు లోబడి చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ.. ఉత్పత్తి లక్ష్యాలను ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయంతో దేశంలో వంటగ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు పూర్తిస్థాయి ముందస్తు చర్యలు పూర్తయ్యాయి.


Click it and Unblock the Notifications
