Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. బంగారం దిగుమతిపై పెరిగిన టాక్స్.. గ్రాముకు..
Gold Import Tax: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. త్వరలోనే బంగారం ధరలు భారీగగా పెరగనున్నాయి. ఎందుకంటే.. బంగారంపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 5 శాతం మేర పెంచింది. బంగారంపై ఉన్న ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం జూన్ 30న గెజిటెడ్ నోటిఫికేషన్లో తెలిపింది. గత నెలలో దేశ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరిగి రూపాయి విలువ పతనమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం నుంచి పడిపోతున్న ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు, ఖాతా లోటును అదుపులో ఉంచేందుకు ఇంపోర్ట్ డ్యూటీని పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు.
బంగారంపై దిగుమతి సుంకం పెంపు వెనుక:
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భారత వాణిజ్య లోటు సంవత్సరానికి 6.53 బిలియన్ డాలర్ల నుంచి 24.29 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో వాణిజ్య లోటు గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 21.82 బిలియన్ డాలర్ల నుంచి 44.69 బిలియన్ డాలర్లకు పెరిగింది. పెరుగుతున్న వాణిజ్య అంతరం, విదేశీ నిధులు దేశం నుంచి నిరంతర బయటకు వెళ్లడం కారణంగా శుక్రవారం యూఎల్ డాలర్తో రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయి 79.12ని చేరుకుంది.
బంగారం దిగుమతిలో భారత్ స్థానం:
ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారుగా ఉంది. దేశం తన బంగారం డిమాండ్లో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారా పూరిస్తోంది. ఇది ఎక్కువగా ఆభరణాల పరిశ్రమకు వెళుతోంది. మే నెలలో బంగారం దిగుమతులు ఏడాది క్రితంతో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు పెరిగి 7.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న వాణిజ్య లోటు, రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో విలువైన లోహాన్ని దిగుమతిని తగ్గించేందుకు.. తాజాగా కేంద్ర ప్రభుత్వం బులియన్పై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
10 గ్రాముల బంగారం ధర.. రూ.2,000 పెరగనుంది:
తాజా పెంపు తర్వాత బంగారంపై సుంకాన్ని 18.75 శాతానికి పెంచనున్నారు. విలువైన లోహంపై మొత్తం ప్రభావవంతమైన దిగుమతి పన్ను 15.75 శాతానికి పెరుగుతుంది. ఇందులో 12.50 శాతం ప్రాథమిక దిగుమతి సుంకం, 2.5 శాతం అగ్రి సెస్, 0.75 శాతం సాంఘిక సంక్షేమ సర్ఛార్జ్ ఉంటాయి. వీటికి అదనంగా బంగారంపై GST 3 శాతం కూడా వర్తిస్తుంది. వీటన్నింటినీ కలుపుకుంటే రానున్న కాలంలో బంగారం ధర 10 గ్రాములకు 2,000 వేల వరకు పెరగనుందని బ్రోకరేజ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి.
వ్యాపారుల ఏమంటున్నారంటే..
దేశీయ డిమాండ్ను తీర్చడానికి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం శుభకార్యాలు, పండుగల సమయం దగ్గరలోనే ఉన్నందున డిమాండ్ పెరుగుతుందని.. ఈ కారణంగా 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.2,000 వరకు పెంపు ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు.