30 వేల టన్నుల బంగారంపై ప్రధాని మోదీ బిగ్ స్కెచ్..ఈ ఒక్క దెబ్బతో పసిడి కరువు తీరినట్లే ఇక..
భారతీయులకు బంగారంతో ఉన్న బంధం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. అది ఒక సెంటిమెంట్, సాంస్కృతిక వారసత్వం, అన్నింటికీ మించి ఒక నమ్మకమైన ఆర్థిక భద్రతా వలయం. పెళ్లిళ్లు, పండుగలు, పాత తరం నుండి కొత్త తరానికి అందే కానుకల ద్వారా ప్రతి ఏటా టన్నుల కొద్దీ బంగారం భారతీయ గృహాల్లోకి చేరుతూనే ఉంటుంది. అయితే ఈ కొనుగోళ్ల వెనుక మరొక నాణెం ఉంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఇళ్లలోని లాకర్లలో, అల్మారాలలో ఆలయ ట్రస్టుల ఖజానాలలో వేల టన్నుల బంగారం వాడకుండా నిద్రాణంగా పడి ఉంది.
పరిశ్రమ అంచనాల ప్రకారం.. ఈ నిరుపయోగ బంగార నిల్వలు సుమారు 30 వేల నుండి 35 వేల టన్నుల వరకు ఉండవచ్చని తెలుస్తోంది, దీని మార్కెట్ విలువ దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వినూత్న పిలుపునిచ్చారు. విదేశాల నుండి నిరంతరం కొత్త బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కంటే, దేశంలోనే నిరుపయోగంగా పడి ఉన్న ఈ భారీ బంగార నిల్వలను పునర్వినియోగంలోకి (రీసైక్లింగ్) తీసుకురావాలని ఆయన కోరారు.

బంగారం రీసైక్లింగ్ అంటే పాత, విరిగిన లేదా కాలం చెల్లిన ఆభరణాలు, నాణేలు, కడ్డీలతో పాటు పారిశ్రామిక వ్యర్థాల నుండి బంగారాన్ని సేకరించి, శుద్ధి చేయడం. ముత్తూత్ ఎగ్జిమ్ సీఈఓ కీయుర్ షా వివరించినట్లుగా. ఈ పాత బంగారాన్ని అత్యాధునిక ప్రక్రియల ద్వారా కరిగించి, 99.9 శాతం స్వచ్ఛమైన 24-క్యారెట్ బంగారంగా మార్చి తిరిగి మార్కెట్ సరఫరా గొలుసులోకి ప్రవేశపెడతారు. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే భూమి నుండి కొత్త బంగారాన్ని తవ్వడానికి విపరీతమైన ఇంధనం, శక్తి అవసరమవుతాయి. అదే రీసైక్లింగ్ ద్వారా ఆ భారం చాలా వరకు తగ్గుతుంది.
ఈ పునర్వినియోగ వ్యూహం వెనుక ఉన్న అసలు కారణం భారతదేశ ఆర్థిక స్థితిగతుల్లో దాగి ఉంది. దేశీయ అవసరాల కోసం భారత్ ఏటా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే Gold దిగుమతుల కోసం దేశం ఏకంగా 72.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. మనం దిగుమతి చేసుకునే ప్రతి గ్రాము Gold వల్ల దేశ కరెంట్ ఖాతా లోటు (CAD) పెరుగుతుంది.విదేశీ మారక నిల్వలపై (Foreign Exchange Reserves) ఒత్తిడి పడుతుంది.
స్వాస్తిక ఇన్వెస్ట్మార్ట్ పరిశోధన విభాగాధిపతి సంతోష్ మీనా, ఛాయిస్ బ్రోకింగ్ అనలిస్ట్ కావేరి మోర్ విశ్లేషణల ప్రకారం.. బంగారం నగదీకరణ పథకం (Gold Monetization Scheme) ద్వారా ఈ నిద్రాణమైన సంపదను బయటకు తీస్తే, ప్రతి గ్రాము రీసైకిల్డ్ బంగారం ఒక గ్రాము దిగుమతి భారాన్ని తగ్గిస్తుంది. ఇది దేశాన్ని ఆర్థికంగా స్వావలంబన వైపు నడిపిస్తుంది.
ఈ ప్రక్రియలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశీయ నిల్వలలో కేవలం 1 శాతం బంగారాన్ని ప్రతి ఏటా క్రమబద్ధమైన పద్ధతిలో రీసైకిల్ చేయగలిగినా, మన వార్షిక దిగుమతులను ఏకంగా 25 నుండి 33 శాతం వరకు తగ్గించుకోవచ్చు. ఈ చిన్న మార్పు దేశ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరచడమే కాకుండా, దేశీయ శుద్ధి కర్మాగారాలు, ఆభరణాల తయారీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అయినప్పటికీ, ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని వదులుకోవడానికి వెనుకాడటం వెనుక సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. తరతరాలుగా ద్రవ్యోల్బణం నుండి రక్షణగా, అత్యవసర సమయాల్లో ఆదుకునే ఆస్తిగా బంగారాన్ని చూస్తారు కాబట్టి ఆభరణాలు వాడకపోయినా వాటిని లాకర్లలోనే ఉంచుతారు.
అయితే ప్రస్తుత రోజుల్లో ఈ ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, లాకర్లలో ఉన్న పాత ఆభరణాల విలువ కూడా ఊహించని విధంగా పెరిగింది. దీనికి తోడు, ప్రస్తుత నగల వ్యాపారులు తక్కువ లేదా సున్నా శాతం కోత (Zero Wastage) వంటి ఆకర్షణీయమైన, పారదర్శకమైన మార్పిడి పథకాలను అందిస్తున్నారు.
ఉన్నత విద్య, ఇళ్ల కొనుగోలు లేదా పిల్లల పెళ్లిళ్ల వంటి పెద్ద అవసరాల కోసం పాత బంగారాన్ని ఇచ్చి కొత్త డిజైన్లను తీసుకోవడానికి లేదా నగదుగా మార్చుకోవడానికి నేటి వినియోగదారులు మరింత సుముఖత చూపిస్తున్నారు. ఈ పారదర్శకత, మారుతున్న అవగాహన వల్ల రాబోయే రోజుల్లో దేశీయ బంగారం ఆర్థికంగా మరింత ఉత్పాదక శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
