Trade Deal: కార్లు, వైన్, మెడిసిన్స్.. ఇకపై అన్నీ చౌకే! భారత్-ఈయూ మెగా ట్రేడ్ డీల్ రహస్యాలివే!
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) మన దేశ వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు కొత్త తలుపులు తెరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. దీనివల్ల 90 శాతానికి పైగా భారతీయ వస్తువులపై సుంకాలు తొలగిపోనున్నాయి.

అయితే సగటు భారతీయుడికి ఈ డీల్ వల్ల ఏ వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి? మార్కెట్ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని గురించిన పూర్తివివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు ఏవి చౌకవుతాయి?
ఐరోపా నుండి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై పన్నులు తగ్గడం వల్ల కింది వస్తువుల ధరలు దిగిరానున్నాయి:
- లగ్జరీ కార్లు (Luxury Cars): యూరోపియన్ కార్లపై ఉన్న భారీ టారిఫ్ లను విడతల వారీగా 10 శాతానికి తగ్గించనున్నారు. ఏటా 2.5 లక్షల వాహనాల కోటాకు ఇది వర్తిస్తుంది. దీనివల్ల ప్రీమియం కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
- యంత్రాలు (Machinery): యూరోపియన్ యంత్రాలపై ఉన్న 44 శాతం వరకు ఉన్న పన్నులను దాదాపుగా రద్దు చేస్తున్నారు. దీనివల్ల పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం తగ్గి, మేడ్ ఇన్ ఇండియా వస్తువులు చౌకయ్యే అవకాశం ఉంది.
- ఔషధాలు (Pharma): ఈయూ నుండి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై ఉన్న 11 శాతం డ్యుటీని తొలగిస్తున్నారు. ఇది ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
- వైద్య పరికరాలు: సర్జికల్, యు మెడికల్ ఎక్విప్మెంట్ పై పన్నుల తొలగింపు వల్ల ఆసుపత్రి ఖర్చులు కొంత మేర తగ్గొచ్చు.
- కెమికల్స్: రసాయనాలపై ఉన్న 22 శాతం వరకు ఉన్న దిగుమతి పన్నులను రద్దు చేస్తున్నారు.
ఆహారం, పానీయాలు: ధరల తగ్గుదల
విదేశీ ఆహార పదార్థాలను ఇష్టపడేవారికి ఈ ఒప్పందం తీపి కబురు అందిస్తోంది:
- ఆలివ్ ఆయిల్: వంట నూనెలు, ఆలివ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి.
- వైన్, బీర్: వైన్ పై పన్నులను 20-30 శాతానికి, బీర్పై పన్నును 50 శాతానికి తగ్గించనున్నారు.
- పండ్ల రసాలు: ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఫ్రూట్ జ్యూస్లపై పన్నులు పూర్తిగా తొలగిపోతాయి.
మరిన్ని కీలక అంశాలు
ఇకపోతే ఈ ట్రేడ్ డీల్ (Trade Deal) కేవలం వస్తువులకే పరిమితం కాలేదు. గ్రీన్ ఎనర్జీ కోసం ఈయూ భారత్ కు సుమారు 500 మిలియన్ యూరోల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అలాగే, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SMEs) కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, వారి ఎగుమతులకు మార్గం సుగమం చేశారు. దీనివల్ల భారత్ లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఏదైనా ప్రియమవుతుందా?
ప్రస్తుతానికి ఈ ఒప్పందం వల్ల ఏ వస్తువు ధర నేరుగా పెరగడం లేదు. అయితే, ఫైనాన్స్, షిప్పింగ్ వంటి సేవా రంగాల్లో ఐరోపా కంపెనీల నుండి పోటీ పెరగడం వల్ల ఆయా సేవల ధరల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, ఈ ఒప్పందం యూరోపియన్ ఎగుమతిదారులకు ఏడాదికి సుమారు 4 బిలియన్ యూరోల ఆదాను ఇస్తుంది, ఆ ప్రయోజనం భారతీయ వినియోగదారులకు ధరల తగ్గింపు రూపంలో అందనుంది.


Click it and Unblock the Notifications


