సైరస్ మిస్త్రీకి షాక్, టాటా సన్స్కు సుప్రీం కోర్టులో భారీ విజయం!!
ముంబై: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో టాటా సన్స్కు ఊరట లభించింది. గతంలో సైరస్ మిస్త్రీని తిరిగి చైర్మన్గా నియమించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLT) ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన ఈ కేసులో తీర్పును రిజర్వ్లో ఉంచింది.
అయిదేళ్ల క్రితం(2016)లో సైరస్ మిస్త్రీని చైర్మన్గా తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్ 18వ తేదీన NCLT తీర్పు చెప్పింది. మిస్త్రీని తిరిగి చైర్మన్గా నియమించాలని ఆదేశించింది. 2020 జనవరి 2వ తేదీన టాటా సన్స్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అదే నెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్సీఎల్టీ తీర్పుపై స్టే విధించింది.
2020 సెప్టెంబర్ 22వ తేదీన టాటా సన్స్లోని షేర్లను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఎక్కడా తాకట్టు పెట్టకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత డిసెంబర్ 8వ తేదీన వాదనలు విన్నది. డిసెంబర్ 17న తీర్పును రిజర్వ్లో ఉంచింది. నేడు టాటా సన్స్ వాదనలను బలపరుస్తూ తీర్పు వెలువరించింది.