అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంకు.. క్యూ3 లో 158% పెరిగి రూ.4,146 కోట్లకు చేరిన లాభం!
ప్రైవేట్ రంగంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఐన ఐసీఐసీఐ బ్యాంకు.... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాషిక ఫలితాల్లో అదరగొట్టింది. ఇటీవల కాలంలో సంస్థ చరిత్రలోనే రికార్డు స్థాయి లాభాన్ని ఆర్జించింది. స్టాండలోన్ ప్రాతిపదికన అక్టోబర్- డిసెంబర్ క్వార్టర్ (క్యూ 3) లో ఐసీఐసీఐ బ్యాంకు ఏకంగా రూ 4,146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాషికంలో బ్యాంకు నికర లాభం కేవలం రూ 1,605 కోట్లు కావటం గమనార్హం.
158% వృద్ధి
అంటే గతేడాది త్రైమాషిక లాభంతో పోల్చితే ప్రస్తుత త్రైమాషికంలో ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభం ఏకంగా 158% వృద్ధి చెందింది. బ్యాంకింగ్ సెక్టార్ లో కొంత కాలంగా అంతకంతకూ పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ప్రతి బ్యాంకునూ ఇబ్బందిపెడుతున్నాయి. అదే సమయంలో దేశంలో ముసురుకుంటున్న ఆర్థిక మందగమనం కూడా ఈ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. అయినప్పటికీ... ఐసీఐసీఐ బ్యాంకు అన్నివిభాగాల్లోనూ మెరుగైన పనితీరును కనబరచడం విశేషం. ఈ త్రైమాషికంలో బ్యాంకు నిరర్థక ఆస్తులు కూడా తగ్గాయి. దాంతో, ఆ మేరకు చేయాల్సిన ప్రొవిజిన్స్ తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాషికంలోని రూ 4,244 కోట్ల ప్రొవిజన్స్ తో పోల్చితే ప్రస్తుతత త్రైమాషికంలో ప్రొవిజన్స్ 51% తగ్గి రూ 2,083 కోట్లకు పరిమితం అయ్యాయి.
మెరుగైన మార్జిన్లు...
బ్యాంకింగ్ రంగంలో పనితీరుకు ప్రధాన ఇండికేటర్ గా పనిచేసే నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం) విషయంలో కూడా ఐసీఐసీఐ బ్యాంకు మెరుగైన పనితీరును కనబరిచింది. క్యూ3 లో బ్యాంకు ఎన్ఐఎం 3.77 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 3.40 శాతంగా ఉండటం తెలిసిందే. రివ్యూ పీరియడ్ లో నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ కూడా 24% రూ 8,545 కోట్లకు పెరిగింది. ఫీజుల రూపంలో లభించే ఆదాయం కూడా 17% పెరిగి రూ 3,596 కోట్లుగా నమోదయ్యింది. ట్రెజరీ ఇన్కమ్ 11% పెరిగి రూ 531 కోట్లుగా ఉంది. వడ్డీయేతర, ట్రెజరీయేతర ఇన్కమ్ రూ 4,043 కోట్లుగా నమోదయ్యింది. ప్రస్తుత త్రైమాషికంలో బ్యాంకు రూ 4,088 కోట్ల మేరకు రికవరీ సాధించినట్లు ఐసీఐసీఐ బ్యాంకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
తగ్గిన ఎన్పీఏ లు ...
ప్రస్తుత క్యూ 3లో బ్యాంకు నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. స్థూల ఎన్పీఏ లు 5.95% తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాషికంలో గ్రాస్ ఎన్పీఏ లు 7.75% గా ఉండటం గమనార్హం. బ్యాంకు మొత్తం రుణాల మంజూరు లో 16% వృద్ధి నమోదు కాగా, రిటైల్ విభాగంలో అత్యధికంగా 19% వృద్ధి కనిపించింది. కార్పొరేట్ రుణాల వృద్ధి 12% గా ఉంది. ఇదిలా ఉండగా, ఐసీఐసీఐ మొత్తం టర్నోవర్ రూ 10 లక్షల కోట్ల మార్కు దాటి రూ 10,07,068 కోట్లకు చేరటం విశేషం. దీంతో పూర్తి ఏడాదికి బ్యాంకు మరింత మెరుగైన ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే బ్యాంకు షేర్లు కూడా పరుగులు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.