IT News: ఉద్యోగుల ఆటలకు ఆటీ కంపెనీలు క్రమక్రమంగా చెక్ పెడుతున్నాయి. ఒకప్పుడు కరోనా సమయంలో డిమాండ్ కారణంగా వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అయితే ఇప్పుడు ఇలాంటి వారిని కంట్రోల్ చేసేందుకు ఐటీ సంస్థలు కఠిన నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే హెచ్ ఆర్ వంటి బ్యాక్ ఆఫీసు కార్యకలాపాలు, మరికొన్ని ఉద్యోగాలను ఏఐ ద్వారా భర్తీ చేస్తామని రెండు రోజుల కిందట ప్రకటించి ఐటీ దిగ్గజం ఐబీఎమ్ టెక్కీలపై బాంబు పేల్చింది. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు ఇలా కోతలకు గురవుతాయని చెప్పకనే కంపెనీ చెప్పింది. దీనికి తోడు తోకజాడించే టెక్కీలను వదిలించుకునేందుకు మరో ప్లాన్ తో కంపెనీ ముందుకు రావటం ఐటీ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కరోనా సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని అందించాయి. ఆ తర్వాత మెల్లగా పరిస్థితులు చక్కబడటంతో హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. కానీ ఇప్పుడు ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలని తాము కోరుకుంటున్నట్లు ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. అందరినీ ఆఫీసులకు తిరిగి రావాలని తాము బలవంతంగా కోరటం లేదని.. అయితే ఆఫీసులకు రావటాన్ని తాము ప్రోత్సహిస్తున్నామన్నారు. ఉద్యోగ కెరీర్ లో నాయకత్వ స్థానాలకు ప్రమోషన్స్ కోరుకునే వారికి వర్క్ ఫ్రమ్ హోన్ సూచనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అలా ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేయటానికి అలవాటు పడితే అది ఉద్యోగి కెరీర్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. కెరీర్ గ్రోత్ కు రిమోట్ వర్క్ కల్చర్ పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. లీడర్ గా ఎదగాలనుకునే వారు తమ టీమ్స్ తో ఎక్కువగా కలవాల్సి ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా నేరుగా చర్చించవలసని పరిస్థితులు ఉంటాయన్నారు. అలాగే అందరూ కలిసి ఆఫీసులో పనిచేయటం వల్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని సీఈవో అన్నారు.
ప్రస్తుతం ఏదో ఒక సమయంలో కంపెనీకి చెందిన దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉంటున్నట్లు అరవింద్ కృష్ణ తెలిపారు.


Click it and Unblock the Notifications