వడ్డీ మాఫీ సొమ్ము వాపసు చేయండి: ఆర్థిక శాఖకు IBA అభ్యర్థన
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి-ఆగస్ట్ మధ్య లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. లోన్ మారటోరియాన్ని ఎంచుకున్న కేసులన్నింటిలోను చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించి రద్దు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించాలని బ్యాంకుల తరఫున కేంద్ర ఆర్థిక శాఖను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) అభ్యర్థించింది.
లోన్ మారటోరియంను ఎంచుకున్న రూ.2 కోట్ల పైబడిన రుణాలు అన్నింటికి చక్రవడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టు మార్చి నెలలో తీర్పు చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన ఈ వడ్డీమాఫీ భారం భారత ప్రభుత్వంపై రూ.5500 కోట్ల మేరకు పడుతోంది. లోన్ మారటోరియం ఉపయోగించుకోని వారితో సహా రుణగ్రహీతలు అందరికీ ఈ స్కీం వర్తిస్తుంది. వివిధ బ్యాంకులు విభిన్న దశల్లో ఈ స్కీంను అమలు చేశాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది (2020) మార్చి చివరి వారంలో సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా మారటోరియం వెసులుబాటు కల్పించాలనే విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆ వెసులుబాటు లభించలేదు.