కోకాపేటలో హైడ్రా మెరుపుదాడులు.. రూ. 4,117 కోట్ల విలువైన భూములు స్వాధీనం.. చెరువులు మింగేసి మరీ కట్టడాలు..
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ భూములను మింగేస్తున్న అక్రమార్కుల గుండెల్లో 'హైడ్రా' (HYDRAA) మరోసారి వణుకు పుట్టించింది. నగరంలోనే అత్యంత ఖరీదైన ఐటీ కారిడార్గా పేరొందిన కోకాపేట, శేరిలింగంపల్లి పరిసరాల్లో సాగుతున్న వేల కోట్ల రూపాయల భూదందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. నిన్న నగరం నలువైపులా ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించిన హైడ్రా బృందాలు.. బడా రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలను బట్టబయలు చేస్తూ ఏకంగా రూ. 4,117 కోట్ల విలువైన ప్రభుత్వ, చెరువుకు సంబంధించిన (FTL) భూములను స్వాధీనం చేసుకున్నాయి.
ప్రస్తుత మార్కెట్లో ఎకరం భూమి ధర రూ. 150 కోట్లకు పైగా పలికే కోకాపేట ప్రాంతంలో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు చేసిన భారీ అక్రమాలు ఈ దాడుల్లో వెలుగుచూశాయి. ఇక్కడి 'కొత్తచెరువు' పూర్తిస్థాయి నీటిమట్టం (FTL) పరిధిలోని 1.09 ఎకరాల చెరువు భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించింది. అక్కడ 'గోల్డ్ఫిష్ కాలనీ' పేరుతో లగ్జరీ విల్లాలను నిర్మించడమే కాకుండా, మిగిలిన చెరువు భాగాన్ని మట్టితో పూడ్చివేసి నివాసితుల కోసం విలాసవంతమైన గార్డెన్లు, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను కూడా ఏర్పాటు చేసింది.

ప్రజావాణిలో బాధితులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా రంగంలోకి దిగింది. శాటిలైట్ రికార్డులను పరిశీలించి అది చెరువు భూమి అని పక్కాగా నిర్ధారించుకున్నాక, భారీ జెసిబిలతో అక్రమ కట్టడాలను, స్పోర్ట్స్ కోర్టులను నేలమట్టం చేసింది. ఇదే ప్రాంతంలోని 'పెద్దచెరువు' పరిధిలో బహుళ అంతస్తుల భవనాల (High-rise buildings) కోసం ఆక్రమించిన సుమారు 22 ఎకరాల విలువైన స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క కోకాపేటలోనే రక్షించిన భూముల మార్కెట్ విలువ రూ. 3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లోని 'ఈదులకుంట చెరువు'ను ఏకంగా మ్యాప్ నుంచే శాశ్వతంగా తొలగించేందుకు కబ్జాదారులు వేసిన ఒక నమ్మశక్యం కాని కుట్రను హైడ్రా భగ్నం చేసింది. పక్కనే ఉన్న తమ్మిడికుంట చెరువు నిండినప్పుడు వచ్చే వరద నీటి కాలువను (Inflow channel) కబ్జాదారులు దారి మళ్లించారు. దీనివల్ల నీరు రాక ఈదులకుంట చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఆ తర్వాత ఆ ఎండిన స్థలంలో భారీ ఆకాశహర్మ్యాలు (Skyscrapers) నిర్మించేందుకు బిల్డర్లు ప్లాన్ చేశారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో కేసు కూడా నడుస్తోంది.
అయినప్పటికీ వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు, పాత ఎఫ్టీఎల్ రికార్డుల ఆధారంగా రేఖాచిత్రాలను పరిశీలించి రూ. 600 కోట్ల విలువైన 6.50 ఎకరాల చెరువు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అలాగే దీనికి ఆనుకుని ఉన్న మరో రూ. 500 కోట్ల విలువైన 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారుల బారి నుండి కాపాడారు.
భవన నిర్మాణదారులే కాకుండా, సామాన్య ప్రజల రవాణాకు అడ్డుపడుతూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించిన ఒక భూయజమానిపై కూడా హైడ్రా చర్యలు తీసుకుంది. భరత్నగర్-హఫీజ్పేట్ ప్రధాన మార్గంలో రోడ్డు విస్తరణ (Road widening) కోసం గతంలోనే జీహెచ్ఎంసీ భూసేకరణ పూర్తి చేసి, సదరు యజమానికి భారీగా పరిహారం కూడా చెల్లించింది. అయితే పరిహారం తీసుకున్నప్పటికీ, ఆ యజమాని 1700 గజాల స్థలాన్ని ఖాళీ చేయకుండా దానిపై ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని, గోశాలను నిర్మించాడు.
దీనివల్ల ఆ మార్గంలో ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్ జామ్లు ఏర్పడి వాహనదారులు నరకం చూశారు. స్థానికుల నుండి ఫిర్యాదులు రావడంతో వెంటనే స్పందించిన హైడ్రా, ఆ రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేసింది. దాదాపు రూ. 17 కోట్ల విలువైన ఈ స్థలాన్ని వెంటనే రోడ్డు విస్తరణ పనుల కోసం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. హైడ్రా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్ నగరంలోని బడా కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రభుత్వం పంపిన ఒక బలమైన హెచ్చరికగా నిలిచింది. ఎంతటి వారైనా చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications
