ప్రాణాల మీదకు తెస్తున్న 10 నిమిషాల ఫాస్ట్ డెలివరీ.. రైడర్ జీవితాలపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్
ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి హైపర్-ఫాస్ట్ డెలివరీ మోడళ్లపై తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం కొన్ని నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి మధ్య పనిచేస్తున్న డెలివరీ భాగస్వాముల భద్రతపై అనేక ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ ప్రమాదంలో క్విక్-కామర్స్ సంస్థ జెప్టోలో పనిచేస్తున్న 25 ఏళ్ల డెలివరీ రైడర్ ప్రాణాలు కోల్పోవడం హైదరాబాద్ నగరవ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ విషాద ఘటన జనవరి 5న సాయంత్రం సుమారు 5:15 గంటల సమయంలో.. టోలిచౌకి-మెహదీపట్నం మధ్య ఉన్న అత్యంత రద్దీ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అభిషేక్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై డెలివరీ చేస్తుండగా అకస్మాత్తుగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయాడు. అతను జెప్టో ప్లాట్ఫామ్కు డెలివరీ భాగస్వామిగా పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

అభిషేక్ రోడ్డుపై పడిపోయిన కొద్ది సెకన్లలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతనిపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాల పాలైన అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని గమనించకుండా బస్సు ముందుకు వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మెహదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి, సంబంధిత బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, బాధ్యత ఎవరిది అన్న అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో పాటు హైపర్-ఫాస్ట్ Delivery మోడళ్లపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఒక ప్రకటనలో ప్లాట్ఫామ్ కంపెనీల వైఖరిని తీవ్రంగా ప్రశ్నించారు. 10 నిమిషాల్లో ఆహారం, కిరాణా సరుకులు డెలివరీ చేయడానికి లక్ష్యాలు సమయానికి అమలవుతాయి. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు సమయానికి ప్రారంభమవుతాయి. అయితే ఒక కార్మికుడు రోడ్డు ప్రమాదానికి గురైతే, అతనికి బీమా, పరిహారం ఎందుకు ఆలస్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు.
అత్యంత వేగవంతమైన డెలివరీ లక్ష్యాలు కార్మికులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని యూనియన్ ఆరోపించింది. బోర్డు రూమ్లో తీసుకునే నిర్ణయాలు గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కార్మికులు అల్గోరిథం లాంటి వారు కాదు.. వారు కూడా మనుషులు. ప్రాణాలకు ముప్పు కలిగించే డెలివరీ లక్ష్యాలను వెంటనే తొలగించాలని యూనియన్ డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న కార్మికుల భద్రత, బీమా, జవాబుదారీతనం అంశాలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని TGPWU కోరింది. తెలంగాణ కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ అంశాన్ని గంభీరంగా పరిగణనలోకి తీసుకుని, స్పష్టమైన భద్రతా ప్రమాణాలు రూపొందించాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.
ఏదేమైనా హైదరాబాద్లో జరిగిన ఈ విషాదకర ఘటన కేవలం ఒక ప్రమాదంగా కాకుండా.. వేగవంతమైన డెలివరీ మోడళ్లలో దాగి ఉన్న ప్రమాదాలను మరోసారి బహిర్గతం చేసిన ఘటనగా మారింది. డెలివరీ వేగం కంటే కార్మికుల ప్రాణాలే ముఖ్యమన్న అంశంపై సమాజం, సంస్థలు, ప్రభుత్వం కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన బలంగా సూచిస్తోంది.


Click it and Unblock the Notifications


