Hyderabad: హైదరాబాద్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఏసీబీ రైడ్.. నీళ్లమ్ముకుని కోట్లు సంపాదించిన అధికారి గుట్టురట్టు!
భాగ్యనగరంలో ఎండలు ముదిరినా, నీటి సరఫరా తగ్గినా సామాన్యులు ఆశ్రయించేది జలమండలి ట్యాంకర్లనే. అలాంటిది, బుక్ చేసిన ట్యాంకర్ రోజులు గడుస్తున్నా రాకపోవడంతో హైదరాబాద్ (Hyderabad) వాసులు ఎంతో కాలంగా నరకం చూస్తున్నారు. అయితే, జనం నీళ్ల కోసం పడుతున్న ఈ కష్టాలను ఆసరాగా చేసుకుని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఏకంగా రూ. వంద కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వరేజ్ బోర్డు (HMWS&SB) ప్రాజెక్ట్ డివిజన్-VIII లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) గా పనిచేస్తున్న సగ్గం అనంత లక్ష్మి కుమార్ ఇళ్లపై తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు మంగళవారం ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో బయటపడ్డ ఆస్తుల లిస్ట్ చూసి ఏసీబీ అధికారులకే మైండ్ బ్లాక్ అయ్యింది.

ఏసీబీ సోదాల్లో దొరికిన కుబేరుడి ఖజానా!
కుమార్ మల్లాపూర్లోని తన నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్లలోని అతని బంధువులు, బినామీలకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం డాక్యుమెంట్ విలువ రూ. 5.88 కోట్లే అయినప్పటికీ.. వీటి అసలు మార్కెట్ విలువ రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఉండవచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ తెలిపారు.
- నగదు, బంగారం: మల్లాపూర్ ఇంట్లోనే ఏకంగా రూ. 1.1 కోట్ల పచ్చి నోట్ల కట్టలు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు లభ్యమయ్యాయి.
- భూములు, ఇళ్లు: నిజామాబాద్లోని నవీపేట, బోధన్లతో పాటు సంగారెడ్డిలోని చేర్యాలలో కలిపి ఏకంగా 18 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు దొరికాయి.
ఇవి కాకుండా మహేశ్వరంలో 6 ఓపెన్ ప్లాట్లు, ఉప్పల్లో 3 ఫ్లాట్లు, మల్లాపూర్లో ఒక జీ+3 ఇల్లు, లగ్జరీ కార్లు, బైకులు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా వీరి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది!
రోజుకు రూ. 50,000 బ్లాక్ మనీ! ఎలా చేశాడంటే?
కేవలం ప్రభుత్వ ఉద్యోగ జీతంతో 18 ఎకరాల భూములు, ఇన్ని ఫ్లాట్లు కొనడం అసాధ్యం. ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం.. కుమార్ ట్యాంకర్ల సప్లైలో పెద్ద మాఫియా నడిపాడు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగుల నీటి అవసరాలను క్యాష్ చేసుకున్నాడు.
బోర్డు రికార్డుల్లోకి ఎక్కించకుండా "అనధికారిక బుకింగ్స్" చేస్తూ, ఒక్కో ట్యాంకర్కు ఏకంగా రూ. 5,000 వరకు వసూలు చేశాడు. ఇలా రోజుకు కనీసం రూ. 50,000 సొంత జేబులోకి వేసుకునేవాడని అధికారులు చెబుతున్నారు.
జనం ఆగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్!
"మేం సామాన్యులం.. పెద్ద పెద్ద మొత్తాలు లంచాలు ఇచ్చుకోలేం. మూడు రోజుల క్రితం ట్యాంకర్ బుక్ చేస్తే ఇప్పటికీ రాలేదు" అని ఒక హైదరాబాద్ (Hyderabad) వాసి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "మా ట్యాంకర్ బుకింగ్స్ ఎందుకు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయో ఇన్నాళ్లకు అర్థమైంది" అంటూ జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం లక్ష్మి కుమార్ను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. అయితే నెటిజన్లు మాత్రం, "కొన్ని రోజులు సస్పెండ్ అవుతారు, మళ్లీ లంచాలు ఇచ్చి ప్రమోషన్తో వస్తారు.. సామాన్యులకు నీళ్లు మాత్రం రావు" అంటూ ఈ సిస్టమ్పై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై నగరవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.


Click it and Unblock the Notifications