పండగకి ఊరెళ్తున్నారా? టోల్ బాదుడు నుంచి తప్పించుకునే అవకాశం.. ఎలాగో చూడండి!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. లక్షలాది మంది తమ సొంత ఊర్లకు క్యూ కడతారు. అయితే ఈ పండగ ప్రయాణాల్లో అందరినీ వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్స్ అలాగే టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి చూడటం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లైఫ్ లైన్ అయిన హైదరాబాద్ విజయవాడ (Hyderabad Vijayawada (NH-65)) నేషనల్ హైవేపై రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. అయితే ఈసారి ప్రయాణికులకు ఊరటనిచ్చే ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కీలక విన్నపం
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఒక సంచలన లేఖ రాశారు. జనవరి 9 నుండి 18 వరకు సంక్రాంతి రద్దీ దృష్ట్యా.. హైదరాబాద్ విజయవాడ (Hyderabad Vijayawada) హైవేపై టోల్ ఫీజును మినహాయించాలని ఆయన కోరారు. పండగ సమయంలో ట్రాఫిక్ సాధారణం కంటే 200% ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని ఆయన లేఖలో వివరించారు.
తెలంగాణ వాసులకు భారీ లబ్ధి!
సాధారణంగా ఈ హైవేని కేవలం ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారే వాడతారని అనుకుంటారు. కానీ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాలకు వెళ్లే వేలాది మంది తెలంగాణ ప్రజలు కూడా ఈ రోడ్డునే నమ్ముకున్నారు. వీరు రాష్ట్రం దాటకపోయినా పంతంగి, కొర్లపహాడ్ వంటి ప్లాజాల వద్ద భారీగా టోల్ చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. కేవలం ఒక కారు ప్రయాణంలోనే అటు ఇటు కలిపి సుమారు రూ. 700 పైగా ఆదా అయ్యే అవకాశం ఉంది.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ గండం
సాధారణ రోజుల్లో పంతంగి టోల్ గేట్ వద్ద రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాలు వెళ్తుంటాయి. కానీ, సంక్రాంతి సమయానికి ఆ సంఖ్య ఏకంగా 1 లక్షకు చేరుకుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
- పంతంగి: ఇది హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది.
- కొర్లపహాడ్: ఇది మరో 60 కి.మీ దూరంలో ఉంటుంది.
- చిల్లకల్లు: ఇది ఏపీ సరిహద్దు సమీపంలో ఉంటుంది.
బస్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో సొంత వాహనాల్లో వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకు ఈ టోల్ మినహాయింపు దొరికితే అది నిజంగా పెద్ద పండగే అని చెప్పాలి.
మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ విన్నపంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, ఈ సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోవడమే కాకుండా జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వస్తే ప్రయాణీకులకు టోల్ బాధలు తప్పే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications


