ఆ విషయంలో హైదరాబాద్ టాప్: బెంగళూరు కూడా దిగదుడుపే
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సెక్టార్లో హైదరాబాద్.. దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కార్యాలయాల స్థలాల లీజు విషయంలో అన్ని మెట్రో నగరాలను అధిగమించింది. తొలిస్థానంలో నిలిచింది. 2016తో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఆఫీసు స్థలాలు, వాటి లీజు మొత్తం భారీగా పెరిగినట్లు సీబీఆర్ఈ తెలిపింది. ఈ మేరకు ఓ వార్షిక నివేదికను విడుదల చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ తొలి వేవ్ మొదలైన తరువాత- హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, నోయిడా, గుర్గావ్ వంటి ఐటీ హబ్ వంటి ప్రాంతాల్లో దాదాపు అన్ని కార్యాలయాలు మూత పడ్డాయి.
పునరుద్ధరణకు నోచుకోవడంతో భారీ డిమాండ్..
సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో గడుపుతున్నారు. సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత.. మళ్లీ కార్యాలయాలు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో- కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్లో రీజినల్ కార్యాలయాలను నెలకొల్పడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఫలితంగా- భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్ లీజుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు, ఫార్మాసూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు క్రమంగా హైదరాబాద్కు తరలివచ్చాయి.
ఆరు నగరాల్లో టాప్..
మీడియా సంస్థలు కూడా తమ ప్రాంతీయ కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఆఫీస్ స్పేస్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. మొత్తంగా ఆరు నగరాల్లో లీజింగ్కు డిమాండ్ ఏర్పడగా.. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు సీబీఆర్ఈ తన నివేదికలో స్పష్టం చేసింది. 2016తో పోల్చుకుంటే.. ఈ ఏడాది కార్యాలయాల లీజు మొత్తం 34 శాతం పెరిగినట్లు అంచనా వేసింది. దీనితో పాటు కార్యాలయాల స్థలం కూడా 1.03 కోట్ల చదరపు అడుగులకు పెరిగింది.
మూడున్నర కోట్ల చదరపు అడుగులు..
అంటే.. కార్పొరేట్ ఆఫీసులను నెలకొల్పడానికి వీలుగా కొత్త భవనాలు వెలిశాయి. ఈ విషయంలో హైదరాబాద్.. బెంగళూరును కూడా అధిగమించింది. హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా.. బెంగళూరు ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో పలు సంస్థలు 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలాన్ని లీజుకి తీసుకున్నాయి. 21 లక్షల చదరపు అడుగులతో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, 2025 నాటికి మూడు నుంచి మూడున్నర కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని సీబీఆర్ఈ పేర్కొంది.
అవుటర్ చుట్టూ
ప్రస్తుతం ప్రతిపాదనల్లో, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాలు కూడా వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా కార్యాలయాల లీజు స్థలం, మొత్తం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. హైబ్రిడ్ వర్కింగ్ కల్చర్కు అనుకూలంగా.. ఆఫీస్ స్థలాలను తీర్చిదిద్దడానికి రియల్టర్లు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్స్, కొండాపూర్.. ఇలాంటి ప్రదేశాలతో పాటు అవుటర్ రింగ్ రోడ్కు ఆనుకుని కొత్త కార్యాలయాలు వెలుస్తున్నాయని, వాటిల్లో అందుబాటులోకి వచ్చే స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. మూడున్నర కోట్ల చదరపు అడుగులను దాటుతుందని అభిప్రాయపడింది సీబీఆర్ఈ.