వినాయకుడి లడ్డుని ఎరగా వేసి రూ. 3. 45 కోట్లు వసూళ్లు.. హైదరాబాద్లో భారీ మోసం వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..
వినాయక చవితి వేడుకల్లో గణనాథుడి లడ్డును భారీ ధరకు వేలంలో దక్కించుకుని వార్తల్లో నిలిచిన ఓవ్యక్తి.. ఆ లడ్డూ తెచ్చిపెట్టిన గుర్తింపుతో అపార్ట్మెంట్ వాసుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనా హైదరాబాద్లో వెలుగు చూసింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా నమ్మిస్తూ.. అధిక లాభాల ఆశచూపి బాధితుల నుంచి రూ. 3.45 కోట్లకు పైగా సేకరించి పరారైన కొండపల్లి గణేష్ అనే వ్యక్తిపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గచ్చిబౌలిలోని ప్రముఖ మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో నివాసమున్న కొండపల్లి గణేష్.. 2024, 2025 సంవత్సరాల్లో జరిగిన వినాయక ఉత్సవాల్లో మైహోమ్ భుజా గణేశ్ లడ్డూ వేలాల్లో వరుసగా రూ. 29 లక్షలు, రూ. 51.07 లక్షలకు పైగా అత్యధిక ధర చెల్లించి లడ్డూలను దక్కించుకున్నాడు. నగరంలోనే రికార్డు ధరకు లడ్డూను వేలంలో పాడటంతో అతను ఒక్కసారిగా ప్రముఖంగా మారాడు.

తాను రియల్ ఎస్టేట్, వైన్ షాపుల (మద్యం) వ్యాపారాల్లో విజయవంతంగా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ.. అపార్ట్మెంట్లో అందరికీ ప్రసాదం పంపిణీ చేసి, ఎంతో ధనవంతుడైన వ్యాపారవేత్తగా నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ నివాసులతో చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని.. తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే ప్రతి నెలా 6 శాతం రాబడి ఇస్తానని, అలాగే ప్రతి మూడు నెలలకొకసారి లాభాలు చెల్లిస్తామని తన సహచరుడు బోయినపల్లి కిరణ్తో కలిసి కొండపల్లి గణేశ్ పలువురిని నమ్మించాడు.
ఇతని మాటలు, విలాసవంతమైన ప్రవర్తనను నమ్మిన సిల్వియా శ్రీనివాస్ రెడ్డి కుటుంబంతో పాటు బొత్స అప్పలనాయుడు, సి. శ్రీకృప, జి. నాగహరీష్, సముద్రాల రవిశంకర్, సముద్రాల సారిత తదితర నివాసితులు కోట్ల రూపాయలను ఇతనికి పెట్టుబడిగా ఇచ్చారు. ఇలా మొత్తంగా అపార్ట్మెంట్ నివాసితుల నుంచి గణేష్ సుమారు రూ. 3.45 కోట్లకు పైగా వసూలు చేశాడు. కొద్దిరోజుల పాటు నమ్మించిన గణేష్, ఆ తర్వాత ప్రతీ నెలా ఇవ్వాల్సిన రాబడి లేదా అసలు డబ్బులను తిరస్కరిస్తూ రావడం మొదలుపెట్టాడు.
అనుమానం వచ్చిన బాధితులు ఒత్తిడి తీసుకురావడంతో, మైహోమ్ భుజాలోని తన ప్లాట్, కార్యాలయాన్ని అకస్మాత్తుగా ఖాళీ చేసి గచ్చిబౌలిలోని మరో అపార్ట్మెంట్కు మారిపోయాడు. ఆ తర్వాత ఫోన్ కాల్స్కు సమాధానం ఇవ్వకుండా ఎవరికీ అందుబాటులో లేకుండా పరారయ్యాడు. తాను మోసపోయానని గ్రహించిన సిల్వియా శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా కొండపల్లి గణేష్, బోయినపల్లి కిరణ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. లడ్డూ వేలంతో వచ్చిన గుర్తింపును పెట్టుబడిగా పెట్టి చేసిన ఈ ఘరానా మోసం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.ప్రస్తుతం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం కొండపల్లి గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.


Click it and Unblock the Notifications
