ముగిసిన తాజ్ బంజారా హోటల్ ప్రస్థానం.. 40 అంతస్తుల భవనంగా మళ్లీ రీఎంట్రీ.. ఇంకో విషయం ఏంటంటే..
భాగ్య నగరంలోని అత్యంత విలాసవంతమైన, చారిత్రక ఆతిథ్య కేంద్రాలలో ఒకటైన బంజారా హిల్స్లోని ప్రతిష్టాత్మక తాజ్ బంజారా హోటల్ శకం అధికారికంగా ముగియనుంది. ఇకపై ఈ హోటల్ చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది.
బంజారా సరస్సు ఒడ్డున, సుమారు 3.4 ఎకరాల విస్తీర్ణంలో నగరానికి అందాల మందారంగా ఉన్న ఈ ల్యాండ్మార్క్ భవనం కూల్చివేత పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభమైన ఈ పనులు ఇప్పుడు ప్రధాన నిర్మాణ కూల్చివేత దశకు చేరుకున్నాయి. భవనం వెలుపలి గోడలను తొలగిస్తుండటంతో.. ఈ మార్పులు బయటి నుండి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్థలంలో ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కొత్తగా రూపుదిద్దుకోనుంది.

కూల్చివేత పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియ భవనం లోపలి భాగాలను ఖాళీ చేయడంతో ప్రారంభమైంది. మొదటగా లోపల ఉన్న తలుపులు, కిటికీలు, విద్యుత్ వైరింగ్, చెక్క ఫిట్టింగ్లు, ఇనుప ఫిక్చర్లతో పాటు ఇతర పునర్వినియోగించదగిన వస్తువులను తొలగించారు. ఆ తర్వాతే ప్రధాన గోడలు, నిర్మాణాలను కూల్చివేయడం ప్రారంభించారు.
ఈ కూల్చివేత ప్రక్రియ పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్ట్ కోసం తవ్వకాలు మొదలవుతాయి. రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక స్థలంలో సుమారు 40 అంతస్తుల భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నప్పటికీ.. డెవలపర్ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.
హైదరాబాద్లోని మొట్టమొదటి విలాసవంతమైన హోటళ్లలో ఒకటిగా పేరొందిన తాజ్ బంజారాను 1986 వరకు ఐటీసీ గ్రూప్ నిర్వహించింది. ఆ తర్వాత దీని కార్యకలాపాలను తాజ్ జీవీకే హోటల్స్ చేపట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు విజయవంతంగా సేవలందించిన ఈ హోటల్.. లీజు గడువు ముగియడంతో 2023లో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్లుగా సుమారు రూ. 1.43 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గత ఏడాది ఈ భవనాన్ని సీల్ చేసింది.
బకాయిలలో కొంత భాగాన్ని చెల్లించిన తర్వాతే అధికారులు సీల్ను తొలగించారు. ఆ తర్వాత ఈ విలువైన ఆస్తిని గతంలో అరబిందో గ్రూప్గా పిలవబడిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆరో రియల్టీ సుమారు రూ.315 కోట్లకు కొనుగోలు చేసింది. హైదరాబాద్ పశ్చిమ కారిడార్లలో ప్రీమియం నివాస, బహుళ-వినియోగ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఆరో రియల్టీ, ఈ బంజారా హిల్స్ ప్రాజెక్ట్ ద్వారా తన పోర్ట్ఫోలియోలోకి మరో మైలురాయి లాంటి బహుళ అంతస్తుల ప్రాజెక్టును చేర్చుకోనుంది.
గత శతాబ్దపు డెబ్బై, ఎనభైల నాటికి హైదరాబాద్ పాత సంప్రదాయాల నుండి ఆధునిక వాణిజ్య హబ్గా మారడం ప్రారంభించింది. ఆ సమయంలో బంజారా హిల్స్ ప్రాంతం ప్రశాంతమైన గుట్టలు, రాళ్ళు, అందమైన సరస్సులతో నిండి ఉండేది. అటువంటి ప్రదేశంలో ప్రకృతి అందాల మధ్య ఒక అంతర్జాతీయ స్థాయి విలాసవంతమైన హోటల్ను నిర్మించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 1980ల ప్రారంభంలో ఈ హోటల్ నిర్మాణాన్ని ప్రారంభించి.. బంజారా సరస్సు (బంజారా చెరువు)కు అభిముఖంగా అత్యంత సుందరంగా దీనిని తీర్చిదిద్దారు.
ఈ హోటల్ చరిత్రలో మొదటి అధ్యాయం ప్రముఖ ఐటీసీ (ITC) గ్రూప్తో ప్రారంభమైంది. భారతదేశంలో నాణ్యమైన ఆతిథ్య సేవలకు మారుపేరుగా నిలిచిన ఐటీసీ సంస్థ.. 1986 వరకు దీనిని విజయవంతంగా నిర్వహించింది. ఆ కాలంలో హైదరాబాద్కు వచ్చే దేశ విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలకు తాజ్ బంజారా ఒక ప్రధాన విడిది కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా హోటల్ నుండి కనిపించే బంజారా సరస్సు అందాలు, దాని చుట్టూ ఉండే ప్రశాంత వాతావరణం అప్పట్లో నగరంలో మరే హోటల్కూ లేని ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
ఆ తర్వాత 1980ల మధ్యకాలంలో ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జి.వి. కృష్ణారెడ్డి (GVK గ్రూప్), ప్రఖ్యాత తాజ్ గ్రూప్ (ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ - IHCL) భాగస్వామ్యంతో ఏర్పడిన తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలను స్వీకరించింది. తాజ్ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ హోటల్ ప్రతిష్ట మరింత పెరిగింది.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన తాజ్ జీవీకే ప్రస్థానంలో.. ఈ హోటల్ హైదరాబాద్ రాయల్టీకి, ఆధునిక హంగులకు ఒక చక్కటి కలయికగా నిలిచింది. ఇక్కడి రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లు, సరస్సు పక్కన జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు ఎందరో హైదరాబాద్ వాసుల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
కాలక్రమేణా హైదరాబాద్ పశ్చిమ కారిడార్ (మాధాపూర్, గచ్చిబౌలి) వైపు ఐటీ రంగం విస్తరించడం.. సరికొత్త అంతర్జాతీయ హోటళ్లు నగరంలోకి ప్రవేశించడంతో తాజ్ బంజారా తన గుత్తాధిపత్యాన్ని కొంత కోల్పోయినప్పటికీ.. బంజారా హిల్స్ నడిబొడ్డున ఉన్న దీని వ్యూహాత్మక ప్రాధాన్యత మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
అయితే ఈ ఆస్తికి సంబంధించిన లీజు ఒప్పందం గడువు ముగియడం, యాజమాన్యాల మధ్య తదుపరి ఒప్పందాలు కుదరకపోవడంతో.. 2023లో ఈ చారిత్రక హోటల్ తన సుదీర్ఘ ఆతిథ్య ప్రస్థానానికి ముగింపు పలుకుతూ తలుపులు మూసేసింది. తాజాగా ఆరో రియల్టీ దీనిని చేజిక్కించుకోవడంతో, ఇప్పుడు ఆ నాలుగు దశాబ్దాల భవనం నేలమట్టమై. ఆధునిక నగర అవసరాలకు తగ్గట్టుగా ఒక సరికొత్త రూపంలో ఇది రాబోతోంది.


Click it and Unblock the Notifications

