ఆంధ్రప్రదేశ్కు బిగ్ బూస్ట్.. హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్.. తిరుపతి కీలక స్టేషన్గా ప్రతిపాదన..
దక్షిణ భారతదేశ రవాణా రంగాన్ని పూర్తిగా మార్చివేయగల ప్రతిపాదిత బుల్లెట్ రైలు నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన భాగస్వామిగా అవతరించబోతోంది. హైదరాబాద్-అమరావతి-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ను రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సానుకూల స్పందన తెలియజేసింది.
గతంలో ఈ మార్గాన్ని రావెల గ్రామానికి ఆనుకుని నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ, అది అమరావతి, విజయవాడ నగరాలకు దూరంగా జరిగి ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతుందని గుర్తించిన అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం కోరినట్లుగానే అమరావతి మీదుగా వెళ్లేలా ప్రణాళికను మార్చారు. మొత్తం 760.09 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ ప్రతిపాదిత కారిడార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తుంది.

ప్రస్తుతం ఈ నగరాల మధ్య ఉన్న దాదాపు 12 గంటల ప్రయాణ సమయాన్ని ఈ bullet Train ప్రాజెక్ట్ ద్వారా కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్లో అత్యధిక భాగం అంటే 518.54 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోనే సాగనుండగా.. తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు.
ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు మార్గం వెంబడి మొత్తం 18 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా 9 స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే రానున్నాయి. ఈ కారిడార్ తెలంగాణలోని హైదరాబాద్ గచ్చిబౌలి లేదా నానక్రామ్గూడ వంటి ఐటీ హబ్ల చుట్టూ ప్రారంభమై, శంషాబాద్, భారత్ సిటీ, డ్రై పోర్ట్, హాలియా, వడపల్లి స్టేషన్ల గుండా సాగుతుంది.
అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి దాచెపల్లి వద్ద మొదటి స్టాప్గా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నేరుగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని తాకుతూ గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు మీదుగా ప్రయాణించి ఏపీలోని చివరి మజిలీ అయిన తిరుపతికి చేరుకుంటుంది. చివరి దశలో తమిళనాడులోకి ప్రవేశించి తిరువళ్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న మింజూర్ స్టేషన్లలో ఆగుతూ నగర రద్దీని తప్పించుకుని, ప్రధాన టెర్మినస్ అయిన చెన్నై సెంట్రల్ స్టేషన్ వద్ద ముగుస్తుంది.
ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా చిత్తూరు-తిరుపతి మధ్య 65 కిలోమీటర్ల ప్రత్యేక అనుసంధాన కారిడార్ (లింక్ కారిడార్) ఏర్పాటుకు కూడా ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అంగీకరించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్), తుది సర్వే పూర్తయిన తర్వాత కేంద్ర రైల్వే శాఖ తుది ఆమోదం లభిస్తుంది. ఈ అనుసంధాన మార్గం చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్తో అనుసంధానించబడటం వల్ల ప్రయాణికులు బెంగళూరు నుండి చిత్తూరు, తిరుపతి మీదుగా నేరుగా అమరావతికి అత్యంత వేగంగా చేరుకునే వీలు కలుగుతుంది.
ఇటు 306 కిలోమీటర్ల పొడవైన చెన్నై-బెంగళూరు కారిడార్లో కూడా తమిళనాడులో మూడు, కర్ణాటకలో నాలుగు స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో ఒక స్టేషన్ రానుంది. ఈ రెండు ప్రధాన హై స్పీడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక నగరాల మధ్య రవాణా అనుసంధానం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications
