హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ కీలక అడుగు.. 796 ఎకరాల భూసేకరణ ప్రారంభం..
Hyderabad Bullet Train Project: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విప్లవాత్మక పురోగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వేగవంతమైన బాటలు వేస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన హైస్పీడ్ రైల్ కారిడార్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం చారిత్రక అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆ దిశగా ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన సన్నాహాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రైల్వే బోర్డు 'నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్' (NHSRCL) కు అప్పగించింది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దేశంలోని ప్రధాన మహానగరాల మధ్య ప్రయాణ సమయం ఊహించని రీతిలో తగ్గిపోవడమే కాకుండా, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ ఒక అగ్రగామి రవాణా కేంద్రంగా అవతరించనుంది.

హైదరాబాద్ రైల్ కారిడార్ ఏర్పాటులో భాగంలో అతిపెద్ద ఘట్టమైన 'ఇంటిగ్రేటెడ్ మొబిలిటీ హబ్' నిర్మాణానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బహదూర్ గూడలో భారీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 796.28 ఎకరాల భూమిని సేకరించేందుకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రాథమిక నోటిఫికేషన్ను విడుదల చేశారు.
ముఖ్యంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో ఉన్న బహదూర్ గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62 లలో సుమారు 650 ఎకరాల భూమిని బుల్లెట్ ట్రైన్ హబ్ నిర్మాణానికి ప్రత్యేకంగా గుర్తించారు. సేకరించాల్సిన భూమి అధిక శాతం ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండటంతో భూసేకరణ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సరిహద్దుల గుర్తింపు పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ మల్టీమోడల్ హబ్ హైదరాబాద్ నుండి దక్షిణ, పశ్చిమ భారతంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై మరియు ముంబైలకు ప్రతిపాదించిన హై స్పీడ్ రైలు కారిడార్లకు ప్రధాన కేంద్ర బిందువుగా వ్యవహరించనుంది. ప్రాజెక్టు ప్రణాళికల ప్రకారం హైదరాబాద్-చెన్నై మరియు హైదరాబాద్-బెంగళూరు కారిడార్లకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (DPR) 2026 సెప్టెంబర్ నుండి 2027 మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్-ముంబై కారిడార్ డిపిఆర్ పనులను చేపట్టనున్నారు. భూసేకరణతో పాటు ప్రీ-కన్స్ట్రక్షన్ పనులు, కాంట్రాక్ట్ పత్రాల రూపకల్పనను ఒకేసారి వేగవంతం చేయడంతో, హైదరాబాద్లో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు పనులు అతి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.


Click it and Unblock the Notifications
