బంగారం ధరలు ఇక తగ్గే అవకాశం లేదు..పసిడి రేట్లపై ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బిసి కీలక అంచనా..
బంగారం ధరలు ఇటీవల కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బిసి (HSBC) పసిడిపై తన అంచనాను భారీగా తగ్గించుకుంది. ఇటీవల జరిగిన భారీ కరెక్షన్ తర్వాత HSBC.. 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన Gold ధరల అంచనాలను సవరించింది.
బలమైన అమెరికన్ డాలర్, కఠినమైన ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన అంచనాలు స్వల్పకాలంలో బంగారం ధరలపై ఒత్తిడి తీసుకొస్తాయని బ్యాంక్ పేర్కొంది. అయితే, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక అనిశ్చితులు, పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు వంటి దీర్ఘకాలిక అంశాలు Gold బుల్ మార్కెట్కు ఇప్పటికీ మద్దతు ఇస్తాయని HSBC స్పష్టం చేసింది. అమెరికా డాలర్ బలం పుంజుకోవడంతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంలో వస్తున్న మార్పులే రాబోయే కాలంలో బంగారానికి అతిపెద్ద సవాళ్లుగా మారుతున్నాయని సంస్థ పేర్కొంది.

అయితే ప్రస్తుత పతనం కేవలం తాత్కాలిక దిద్దుబాటు (Correction) మాత్రమేనని.. దీర్ఘకాలంలో బంగారం బుల్లిష్ పెరుగుదల కొనసాగుతుందని HSBC గట్టిగా విశ్వసిస్తోంది. ఈ క్రమంలో 2026 సంవత్సరానికి తన సగటు ధర అంచనాను ఔన్సుకు 4,864 డాలర్ల నుండి 4,560 డాలర్లకి తగ్గించింది. అలాగే 2027వ సంవత్సరానికి అంచనాను 5 వేల డాలర్ల నుండి 4,925 డాలర్లకి సవరించింది. ఇక 2028, 2029 దీర్ఘకాలిక అంచనాల్లో ఆ సంస్థ ఎలాంటి మార్పూ చేయలేదు.
భారత మార్కెట్ విషయంలో దేశీయ నిపుణులు కూడా దాదాపు ఇవే అంచనాలతో ఉన్నారు. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా అభిప్రాయం ప్రకారం.. దేశీయంగా బంగారం ధరలు ఇప్పటికే దాదాపు కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయి.
మార్కెట్లో ప్రతికూల వార్తలు ఉన్నప్పటికీ.. ఇక్కడి నుండి గరిష్టంగా మరో 5 శాతం మాత్రమే పతనం ఉండవచ్చని, అంతకు మించి భారీగా పడిపోయేందుకు ఎలాంటి సంకేతాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత సూచనల ప్రకారం.. భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ. 1.35 లక్షల వద్ద ఒక బలమైన మద్దతు ఏర్పడవచ్చని.. ధరలు ఈ స్థాయి కంటే కిందకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువని ఆయన పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఎలా కదులుతాయనే దానిపై HSBC కీలక విశ్లేషణ చేసింది. 2026లో మిగిలిన కాలానికి గాను అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 3,800 డాలర్ల నుండి 4,700 డాలర్ల మధ్య విస్తృత శ్రేణిలో ట్రేడ్ కావచ్చని భావిస్తోంది. కెవిన్ వార్ష్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అమెరికా ద్రవ్య విధానంపై మార్కెట్ అంచనాలు పూర్తిగా మారిపోయాయి. గతంలో వడ్డీ రేట్ల కోతను ఆశించిన మార్కెట్లు, ఇప్పుడు రేట్ల పెంపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్, డాలర్ విలువ పెరగడం బంగారానికి ప్రతికూలంగా మారింది. జనవరిలో ఔన్సుకు రికార్డు స్థాయిలో 5,450 డాలర్లకి చేరిన బంగారం, జూన్ నాటికి ఏకంగా 20 శాతం మేర పతనమై 3,942 డాలర్లకి పడిపోవడానికి ఈ పరిణామాలే ప్రధాన కారణం.
అయినప్పటికీ పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, తమ విదేశీ మారక నిల్వలను కేవలం డాలర్లకే పరిమితం చేయకుండా వైవిధ్యపరచాలనే ప్రపంచ కేంద్ర బ్యాంకుల వ్యూహాలు దీర్ఘకాలిక పెట్టుబడిదారులను మళ్లీ సురక్షితమైన బంగారం వైపే ఆకర్షిస్తున్నాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
