LPG Price Hike: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. 2023లో అత్యధికంగా గ్యాస్ ధరలను చమరు కంపెనీలు నిన్న పెంచుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. అయితే ఇది సామాన్యులు, వ్యాపారులపై పెద్ద భారంగా నిలిచింది. కొన్ని కంపెనీలకు మాత్రం ఇది భారీగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి.

ధరల పెరుగుదల..
డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మార్పు దాదాపు ఏడు నెలల తర్వాత జరిగింది. జూలై 2022 తర్వాత గృహ వినియోగ సిలిండర్ల ధరను రూ.50 పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఇదే సమయంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్లపై ఏకంగా రూ.350.50 పెంపును దేశంలోని చమురు కంపెనీలు ప్రకటించాయి. ఫిబ్రవరిలో వార్షిక యూనియన్ బడ్జెట్ ఉన్నందున ఆ నెలలో గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులను ప్రకటించలేదు.

లాభపడిన స్టాక్స్..
దేశంలోని గ్యాస్ ధరలను ప్రతినెల మెుదటి తారీఖున ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు మార్పు చేస్తుంటాయి. ఈ క్రమంలో వాటి షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈ సూచీలో ఇండియన్ ఆయిల్ షేర్లు 0.6 శాతం మేర లాభపడ్డాయి. ఇంట్రాడేలో స్టాక్ ధర గరిష్ఠంగా రూ.76.5 స్థాయిని తాకింది. ఇదే క్రమంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ 0.8 శాతం మేర లాభపడి రూ.319.2 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో మరో దిగ్గజ చమురు సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం స్టాక్ 0.8 శాతం మేర లాభపడి రూ.216.9 స్థాయిని తాకింది.

ఈ రోజు మార్కెట్లో..
దేశీయ చమురు కంపెనీలు నేడు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. HPCL, BPCL, Indian Oil స్టాక్స్ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు తమ పెట్రోల్, డీజిల్ విక్రయ వ్యాపారంలో అంతర్జాతయ ధరల ఒత్తిళ్ల వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు తాజా గ్యాస్ ధరలు కొంత సహాయపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల పెంపు కంపెనీకి ఆదాయాన్ని పెంచటంలో దోహదపడుతుందని భావించటంతో ఇన్వెస్టర్లు సైతం కంపెనీల షేర్లపై సానుకూలంగా ఉన్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications