రైతన్నను ముంచుతున్న జీఎస్టీ ... ఎలాగంటే!
ఆరుగాలం కష్టపడి దేశంలోని 130 కోట్ల మందికి మూడు పూటలా అన్నం పెట్టె రైతన్నకు అన్ని రంగాల్లోనూ దోపిడీ ఎదురవుతోంది. స్వతంత్ర భారతంలో పంచ వర్ష ప్రణాళికల నుంచి ఇప్పటి జీఎస్టీ వరకు రైతన్నలకు మేలు చేసే పథకాలు లేవంటే అతిశయోక్తి కాదు. దేశంలో సగానికి పైగా జనాభా ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. అంతే పెద్ద మొత్తంలో బతుకుదెరువు కోసం ఆధారపడుతున్న రంగం కూడా ఇదే. ఘనతికెక్కిన మన ప్రభుత్వాలు రైతుల కోసం అది చేస్తున్నాం ... ఇది చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకోవటమే గానే వారికి ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టటంలో మాత్రం చాలా వెనకపడిపోయాయి. ఏవో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలు ఇందుకు మినహాయింపు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పే ఏ పథకమూ వారికి నూరు శాతం ప్రయోజనం కల్పించింది లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే జీఎస్టీ. ఒకే దేశం... ఒకే పన్ను అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ .... అటు వినియోగాగురులకు గానీ, ఇటు వ్యాపారులకు గానీ మేలు చేసిన దాఖలా లేదు. పైపెచ్చు దేశంలోని రైతులను నిండా ముంచేస్తోంది. ఎలాగో మేరే చదవండి. దీనిపై ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాల ఆధారంగా మీకోసం ఈ ఆర్టికల్.
సంక్లిష్టం....
జీఎస్టీ అమల్లోకి వచ్చి సుమారు రెండేళ్లు గడుస్తున్నా ... ఇప్పటికీ ఎవరికీ దీనిపై పూర్తిస్థాయి పట్టు రాలేదు. అకౌంటెంట్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ఇంకా సందేహాలు ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒకే దేశం ఒకే పన్ను అన్నారు కానీ.... రకరకాల స్లాబులతో దీన్ని సంక్లిష్టంగా మార్చివేశారు. సుమారు వంద సార్లు మార్గనిర్దేశకాలను మార్చివేశారు. దీంతో ఏది ఫాలో కావాలో తెలియని పరిస్థితి. మిగితా రంగాల మాట ఎలా ఉన్నా... వ్యవసాయం రంగ ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి తప్పించారు. ఇది మంచి నిర్ణయమే కానీ దీంతో రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కేమిటంటే రైతులు ఉపయోగిస్తున్న వివిధ రకాల ఇన్పుట్లకు చెల్లిస్తున్న జీఎస్టీకి ఇన్పుట్ క్రెడిట్ పొందే వీలు లేకుండా పోయింది.
రూ 14,500 కోట్ల నష్టం...
జీఎస్టీ లో రైతులకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందే అవకాశం కల్పించటం మరిచిపోవటంతో దేశంలోని రైతన్నలు సుమారు రూ 14,500 కోట్లు నష్ట పోతున్నారు. వారు కొనుగోలు చేస్తున్న సీడ్స్, ఫెర్టిలైజర్స్, ట్రాక్టర్లు సహా ఇతర ఇన్పుట్ ఉత్పత్తులు, పరికరాల పై 5% నుంచి 18% వరకు జీఎస్టీ చెల్లిస్తున్నారు. దీని మొత్తం సుమారు రూ 14,500 కోట్లుగా లెక్క తేలింది. అయితే, రైతులు పండించిన పంటను విక్రయించేప్పుడు వారికి జీఎస్టీ వర్తించదు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ సున్నాశాతం కాబట్టి .... వారు ఇన్పుట్ క్రెడిట్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఇది రైతులు చెల్లిస్తున్న జీఎస్టీ లో కొంత భాగమే. ఇంకా పూర్తిస్థాయి అంచనాలు చాలా అధికంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మూల సూత్రాలకు విరుద్ధం...
దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ... అది దేశ పౌరులందరికీ సమ న్యాయం చేస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఒకే దేశం ... ఒకే పన్ను అనే మౌలిక సూత్రం దేశంలోని సగానికిపైగా ఉన్న రైతులు అనే పౌరులకు మాత్రం వర్తించక పోవటం విచారకరం. దీన్ని ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు. జీఎస్టీ సహా అనేక పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. లేదంటే ఒక వర్గాన్ని పూర్తిగా విస్మరించే ఆర్థిక సంస్కరణ ఫలాలు ఎలా అందరికీ వర్తించినట్లు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దాని ద్వారా రావాల్సిన మౌలిక మార్పులు వ్యవసాయ రంగంలో ఎలా సాధ్యమవుతాయో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.
కంపెనీలకు మాత్రం...
ప్రతులకు వివిధ రకాల ఇన్పుట్ ఉత్పత్తులు, పరికరాలను విక్రయిస్తున్న కంపెనీలు, సంస్థలు మాత్రం తాము చెల్లించిన జీఎస్టీ కి ఇన్పుట్ క్రెడిట్ పొందుతున్నాయి. రైతులకు విక్రయించిన ఉత్పత్తులపై విధించిన పన్నును కూడా ఇతర పన్ను చెల్లింపుల్లో సర్దుబాటు చేసుకొంటున్నాయి. అంటే ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు, రిటైలర్ల కు ఉన్న ఇన్పుట్ క్రెడిట్ సదుపాయం... రైతులకు కల్పించకపోవడం ఎలా సమ న్యాయం అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి రైతులకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.