టాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారు
కరోనా మహమ్మారిపై పోరుకు పారిశ్రామిక వర్గాలు ముందుకు వచ్చాయి. పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. నిధుల రూపంలో లేదా మెడిసిన్ లేదా ఇతర రూపాల్లో సహకరించేందుకు ముందుకు వస్తున్నారు. ఆటో ఉత్పత్తి నిలిచిపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా తమ ప్లాంట్లలో వెంటిలెటర్లు ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద మొత్తంలో సహకరానికి ముందుకు వచ్చింది.
రూ.30,000 కంటే తక్కువ శాలరీ ఉంటే: ఉద్యోగులకు రిలయన్స్ ఊరట
టాటా సన్స్ రూ.1500 కోట్ల భూరి విరాళం
కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎధుర్కొంటున్న తరుణంలో టాటా సంస్థ రూ.1,500 కోట్ల భూరి విరాళాన్ని ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్యం కోసం టాటా ట్రస్ట్ తరఫున రూ.500 కోట్లు, టాటా సన్స్ సంస్త తరఫున రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు రతన్ టాటా, చంద్రశేఖరన్లు వెల్లడించారు. కఠినమైన ఈ సవాల్ను మానవాళి ఎదుర్కొంటోందని, ఈ సంక్షోభం సమయంలో వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆధుకునేందుకు టాటా ట్రస్ట్ కట్టుబడి ఉందని చెప్పారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షక కవచాలు, రోగులను టెస్ట్ చేసేందుకు అనువైన కిట్లు, ఆధునిక సౌకర్యాలు అందించడానికి, ప్రజలకు, ఆరోగ్య కార్యకర్తల కోసం రూ.500 ఖర్చు పెడతామని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం టాటా ట్రస్ట్ ఖర్చు చేసే రూ.500 కోట్లకు తమ సంస్థ అదనంగా రూ.1,000 కోట్లు ఇస్తుందని చంద్రశేఖరన్ తెలిపారు.
వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్ ఉదారత
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఉదారత చాటుకున్నారు. కరోనాతో పోరాడేందుకు రూ.100 కోట్లు ఇస్తున్నట్లు వారం క్రితం ప్రకటించారు. దేశానికి అత్యవసరమైన అవసరమున్నప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోజువారీ కూలీలకు, ఇబ్బంది ఎదుర్కొనే వారికి తన శక్తిమేరకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లు ఇస్తున్నానని, దేశానికి ప్రస్తుతం మన నిర్ణయాలు అత్యంత కీలకమని, చాలా మంది ప్రజలు అయోమయంలో ఉన్నారని, ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో చాలా ఆందోళన చెందుతున్నానని, సాధ్యమైనంతగా వారికి సాయం చేస్తామన్నారు.
రిలయన్స్ సహకారం
రిలయన్స్ కూడా పెద్ద మొత్తంలో సాయానికి ముందుకు వచ్చింది. ముంబైలో 100 బెడ్స్ హాస్పిటల్ సిద్ధం చేసింది. ఈ బెడ్స్ వద్ద మెడికల్ కిట్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. రోజుకు లక్షల మాస్కుల ఉత్పత్తిని పెంచుతామని తెలిపింది. అత్యవసరం కోసం ఉపయోగిస్తున్న వాహనాలకు ఉచిత ఇంధనం, లాక్ డౌన్ కారాణంగా జీవనాధారం కోల్పోయిన వారికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామని ప్రకటించింది. రిలయన్స్ రూ.30,000 లోపు వేతనం ఉన్న తమ ఉద్యోగులకు కూడా అవసరమైన సమయంలో ఈ నెలలో వేతనాన్ని రెండు పర్యాయాలు ఇస్తామని తెలిపింది.
బజాజ్ రూ.100 కోట్లు
పుణేలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కావాల్సిన కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు బజాజ్ గ్రూప్ తెలిపింది. అదే సమయంలో కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు తక్షణ సాయం చేస్తామని తెలిపింది.
హీరో భారీ విరాళం
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో అత్యవసర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ తెలిపింది. కంపెనీతో కలిసి పని చేస్తున్నవారితోపాటు సమాజహితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చైర్మన్ పంకజ్ ఎం ముంజల్ తెలిపారు. మానవతా దృక్పథంతో వ్యాపారం చేయాలన్న సంస్థ నియమాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
సన్ ఫార్మా
కరోనా పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తదితర మందులు, శానిటైజర్స్ సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం, అధికారులతో కలిసి పని చేస్తామని తెలిపింది.
HUL, గోద్రోజ్
ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ రూ.100 కోట్లు కేటాయించింది. అలాగే, లైఫ్ బాయ్ శానిటైజర్లు సబ్బులు తదితర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రకటించింది. గోద్రోజ్ వంటి సంస్థలు సబ్బులు, శానిటైజర్ వస్తువుల ధరలు తగ్గించాయి. 1 మిలియన్ ప్యాకెట్స్ ఉచితంగా అందిస్తామని, శానిటైజర్ ధరలు 66 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. హ్యాండ్ శానిటైజర్స్ ధరను రూ.75 నుండి రూ.25కు తగ్గిస్తున్నట్లు తెలిపింది.
మరిన్ని కంపెనీలు...
దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్స్ అందించేందుకు హ్యుండాయ్ మోటార్స్ తెలిపింది. ఇవి 25 వేలమందికి ఉపయోగపడతాయని చెప్పింది. కరోనాపై పోరులో బీజేపీ ఎంపీలు ఎంపీ ల్యాడ్స్ నుండి రూ.1 కోటి చొప్పున ఇస్తున్నారు. ప్రధానమంత్రి సహాయ నిధికి ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన ఉద్యోగులను కోరింది.