చేతికి చిక్కనంటున్న కాపర్.. బంగారం కన్నా వేగంగా రికార్డు స్థాయిలో ర్యాలీ.. రాగిలో ఎలా పెట్టుబడి పెట్టాలంటే..
భారతీయ, అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో పారిశ్రామిక లోహమైన రాగి (కాపర్) అత్యంత బలమైన పనితీరును కనబరుస్తోంది. భారతీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రాగి ఫ్యూచర్స్ కిలోకు రూ. 1,380 నుండి రూ. 1,400 స్థాయిల్లో ట్రేడవుతూ ఇటీవలి ఆల్ టైమ్ గరిష్టాలకు చేరువలో ఉంది. సెప్టెంబర్ 11న MCX లో రాగి ఇంట్రా-డే గరిష్టంగా రూ. 1,390 ని తాకింది.
ఆగస్టు నెల అంతటా కిలోకు రూ. 1,320 నుండి రూ. 1,430 మధ్య శ్రేణి బద్ధంగా కదిలిన రాగి.. సెప్టెంబర్లోనూ అదే గరిష్ట స్థాయిలను నిలబెట్టుకుంది. అంతర్జాతీయంగా లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో 3 నెలల రాగి ఫ్యూచర్స్ సెప్టెంబర్ 8న టన్నుకు $14,708 రికార్డు స్థాయిని నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు, USD/INR విదేశీ మారకపు రేట్లు, ప్రపంచ వ్యాప్త సరఫరా ఆటంకాలు, నిల్వల ఆందోళనలు దేశీయ MCX ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
రాగి ధరలు ఈ స్థాయిలో వేగంగా పెరగడానికి అమెరికా విధించబోయే సరుకుల సుంకాలపై నెలకొన్న ఆందోళనలు ఒక ప్రధాన కారణం. వైట్ హౌస్ తుది నిర్ణయానికి ముందే వ్యాపారులు, పారిశ్రామిక కొనుగోలుదారులు భారీగా రాగిని నిల్వ చేసుకోవడంతో మార్కెట్లో తాత్కాలిక కొరత ఏర్పడింది. అయితే, శుద్ధి చేసిన రాగిపై సుంకాల నిర్ణయాన్ని అమెరికా వాయిదా వేసిందనే వార్తలతో సెప్టెంబర్ 10న రాగి ధరలు 4 శాతానికి పైగా పడిపోయి అస్థిరతను ప్రదర్శించాయి.

కేవలం సుంకాల భయాలే కాకుండా, రాగికి ఇతర ప్రత్యామ్నాయాలు లేకపోవడం, కొత్త గనుల తవ్వకాలకు దశాబ్దాల సమయం పట్టడం దీనిని వ్యూహాత్మక సరుకుగా మార్చింది. పవర్ గ్రిడ్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలకు భారీగా రాగి అవసరం అవుతోంది. ఎస్&పి గ్లోబల్ (S&P Global) అంచనా ప్రకారం.. ప్రపంచ రాగి డిమాండ్ 2025లోని 28 మిలియన్ టన్నుల నుండి 2040 నాటికి 50 శాతం పెరిగి 42 మిలియన్ టన్నులకు చేరనుంది.
సరఫరా కోణంలో చూస్తే చిలీ, ఇండోనేషియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వంటి కీలక గనుల దేశాల్లో ఉత్పత్తులకు విఘాతం కలిగింది. అయితే, 2026 ప్రాథమిక డేటా ప్రకారం గనుల సరఫరా తగ్గినప్పటికీ, శుద్ధి చేసిన (Refined) రాగి ఉత్పత్తి బలంగానే ఉండి కొంత మిగులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. దీర్ఘకాలిక డిమాండ్ దృష్ట్యా గనుల విస్తరణ మందగించడం రాగి మార్కెట్లో ఆకస్మిక ధరల మార్పులకు కారణమవుతోంది. భారతదేశంలో వేగంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ, విద్యుదీకరణ ప్రాజెక్టుల కారణంగా రాగి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయ రాగి విలువ గొలుసులో భాగస్వామ్యమయ్యేందుకు లిస్టెడ్ కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి.
భారతదేశపు ఏకైక రాగి గని సంస్థ అయిన 'హిందుస్థాన్ కాపర్' FY26 లో 27,421 టన్నుల సాంద్రీకృత లోహాన్ని తవ్వి గడిచిన ఏడేళ్లలో రికార్డు స్థాయిని సాధించింది. ఇది రాగి ధరల పెరుగదలకు నేరుగా లబ్ధి పొందుతుంది. మరొకవైపు 'హిండాల్కో' తన రాగి విభాగంలో FY26లో 487 కేటీ లోహ అమ్మకాలతో రూ. 69,838 కోట్ల ఆదాయాన్ని, రూ. 2,809 కోట్ల EBITDAను నమోదు చేసింది. FY27 మొదటి త్రైమాసికంలోనూ హిండాల్కో రూ. 17,232 కోట్ల రాబడిని సాధించింది.
కంపెనీ తన దహేజ్ స్మెల్టర్ను మరో 3 లక్షల టన్నులకు విస్తరిస్తూ రీసైక్లింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుతోంది. భారత్లో బంగారం, వెండి తరహాలో కాపర్ ETFలు లేనందున, ఇన్వెస్టర్లు MCX ఫ్యూచర్స్ లేదా ఈక్విటీ స్టాక్స్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. అంతర్జాతీయంగా LRS మార్గంలో విదేశీ కాపర్ ETFలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నప్పటికీ పన్నులు, కరెన్సీ హెచ్చుతగ్గులను గమనించాలి. రాబోయే 3 నుండి 5 ఏళ్ల కాల వ్యవధిలో రాగి ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నప్పటికీ, స్వల్పకాలిక అస్థిరత పట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications

