దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో మనం చూసే గంటలు ఎక్కడ తయారవుతాయో.. వాటి వెనుక ఉన్న కథ ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలయాలలో ప్రతిధ్వనించే ఆ పవిత్ర ధ్వని వెనుక శతాబ్దాల నాటి శ్రమ, నైపుణ్యం, సంప్రదాయం దాగి ఉంది. ఆ కథను మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే తూర్పు గోదావరి జిల్లాలోని పెరవలి మండలంలోని చిన్న గ్రామం అజ్జరంను తప్పకుండా సందర్శించాల్సిందే. ఇత్తడి, కాంస్య చేతిపనులకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం నేటికీ భారతీయ సంప్రదాయ హస్తకళలకు ప్రతీకగా నిలుస్తోంది. మూడు తరాల నుంచి ఇత్తడి గంటలు అనేక దేవాలయాలలో మోగిస్తూనే ఉంది.
గోదావరి నది ఉపనదైన వశిష్ట నది ఒడ్డున.. పచ్చని వరి పొలాల మధ్య ప్రశాంతంగా ఉన్న Ajjaram గ్రామం.. రాజమహేంద్రవరం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిన్న గ్రామమే అయినా, ఇక్కడ తయారయ్యే ఇత్తడి గంటలు, కుండలు, దీపాలు, పూజా సామగ్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లోనే కాదు, విదేశాల్లో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లోని కొన్ని చర్చిల్లో కూడా వినియోగంలో ఉన్నాయి. ఇది అజ్జరం కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపుగా చెప్పవచ్చు.

జాతీయ స్థాయిలో మంచి పేరు: అజ్జరంలోని ఇత్తడి పాత్రల పరిశ్రమకు జాతీయ స్థాయిలో మంచి పేరుంది. అలంకార వస్తువుల నాణ్యత, డిజైన్లోని సౌందర్యం, చేతి పనిలో కనిపించే సూక్ష్మత ఈ పరిశ్రమను ప్రత్యేకంగా ముందు వరసలో నిలబెట్టాయి. స్వాతంత్ర్యం తరువాత ఈ వృత్తి వేగంగా అభివృద్ధి చెందింది. ఒక దశలో ఇతర భారతీయ హస్తకళ పరిశ్రమలతో పోలిస్తే రెండవ స్థానంలో నిలిచిందని అక్కడి స్థానికులు గర్వంగా చెబుతారు. శ్రమతో కూడిన ఈ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ గ్రామ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారింది.
దేవత సినిమాలో వందలాది ఇత్తడి కుండలు: దక్షిణ భారతదేశంలో ఇత్తడి పరిశ్రమలో అజ్జరం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడి ఇత్తడి సామాను ప్రజాదరణకు ఓ ఆసక్తికరమైన ఉదాహరణ కూడా ఉంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'దేవత' సినిమాలోని 'వెల్లువచ్చి గోదారమ్మ' పాట కోసం వందలాది ఇత్తడి కుండలను ఉపయోగించారు. ఆ పాట విడుదలైన తర్వాత అజ్జరం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. సినీ ప్రేక్షకులలో కూడా ఈ ఊరి పేరు తరువాత నుంచి విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.

అజ్జరం వరులకు పిల్లనివ్వాలంటే భయం: ఒకప్పుడు ఈ వృత్తిని తక్కువగా చూసిన రోజులు కూడా ఉన్నాయి. అజ్జరం వరులకు తమ కుమార్తెలను వివాహం చేయడానికి ఇతర ప్రాంతాలలో ఉన్న కొంతమంది ఇష్టపడేవారు కాదు. దీనికి కారణం ఏంటంటే.. అత్తింటిలో వారి బిడ్డ ఇత్తడి పనులు చేయాల్సి వస్తుందని భావన. అయితే కాలం మారింది. అదే ఇత్తడి వృత్తి ఈ గ్రామానికి గుర్తింపును, ఆర్థిక భద్రతను తీసుకొచ్చింది. నేడు అజ్జరం దేశంలోనే ఇత్తడి, కాంస్య అవసరాలకు ప్రసిద్ధ కేంద్రంగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తరతరాలుగా కొనసాగుతున్న జీవనోపాధి: సుమారు 2,700 మందికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో.. దాదాపు 2,500 మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇత్తడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇది తరతరాలుగా కొనసాగుతున్న జీవనోపాధి. ఇంకో విశేషం ఏమిటంటే ఇది ఏ ఒక్క కులానికి మాత్రమే పరిమితమైన వృత్తి కాదు. ప్రతి వర్గానికి చెందిన వారు ఈ కళలో నైపుణ్యం సాధించారు. 50 గ్రాముల చిన్న వస్తువుల నుంచి 500 కిలోల బరువు ఉన్న భారీ ఇత్తడి గంటల వరకు, ఒకప్పుడు పూర్తిగా చేతితోనే తయారు చేసేవారు. పెద్దల నుంచి చిన్నవాళ్లకు ఈ కళ సహజంగానే బదిలీ అయ్యేది.
సంప్రదాయ చేతిపనులు మెల్లగా కనుమరుగయ్యే ప్రమాదం: అయితే కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల యంత్రాల వినియోగం ప్రారంభమైంది. దీంతో ఉత్పత్తి వేగం పెరిగింది. శ్రమ కొంత తక్కువైంది. ఇది గ్రామ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. గతంలో పిల్లలను చదువులకు పంపడానికి వెనుకాడిన కుటుంబాలు.. ఇప్పుడు ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే, యంత్రాల వినియోగం పెరుగుతున్న కొద్దీ, సంప్రదాయ చేతిపనులు మెల్లగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి వస్తువు వెనుక కళాకారుడి భావోద్వేగం: ఈ వృత్తిలో నిమగ్నమైన అక్కడి కళాకారులు ఒక విషయాన్ని గర్వంగా చెబుతారు.. ఇక్కడ ఏ వస్తువూ పూర్తిగా యాంత్రికంగా తయారవదు. డిజైన్ నుంచి తయారీ వరకు, చివరి మెరుగుదల వరకు మనిషి చేతి స్పర్శ తప్పనిసరి. ప్రతి వస్తువు వెనుక కళాకారుడి భావోద్వేగం, అనుభవం ప్రతిబింబిస్తుందంటారు. ముఖ్యంగా, ఈ వృత్తిలో ఉన్నవారు తమ జీవన ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేయరు. తమ పనికి వినియోగదారుల నుంచి వచ్చే ప్రశంసలే తమకు పెద్ద గుర్తింపని భావిస్తారు.
గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉన్న స్థానిక పరిశ్రమ యజమాని బి. సత్యలింగం మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో డిమాండ్ కొంత తగ్గిందని, కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోందని తెలిపారు. యువత ఇతర రంగాల వైపు మొగ్గు చూపడం, ముడి సరుకు ధరలు పెరగడం వంటి సమస్యలు ఇత్తడి పరిశ్రమను ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పారు. అయినప్పటికీ, సరైన ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెటింగ్ సదుపాయాలు లభిస్తే.. అజ్జరం ఇత్తడి పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని స్థానికుల అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా అజ్జరం గ్రామం కేవలం ఒక హస్తకళ కేంద్రం మాత్రమే కాదు. అది శ్రమకు, సంప్రదాయానికి, సహనానికి నిలువెత్తు సాక్ష్యం. దేవాలయాలలో మోగే ప్రతి గంట వెనుక ఈ గ్రామ కళాకారుల జీవితం, వారి కథ దాగి ఉంది. వారికి చేయూతనిస్తే మరిని అద్భుతాలు సృష్టిస్తారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications