Bengaluru Water Crisis: మండుటెండల్లో కర్ణాటకలో వాసులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానంగా రాజధాని బెంగళూరు నగరంలో పరిస్థితులు దిగజారాయి. తాగటానికి తప్ప మిగిలిన అవసరాలకు నీరు అందుబాటులో లేకపోవటం ఉద్యోగులను ఆందోళనలకు గురిచేస్తోంది.
నీటి ఎద్దడి ఈసారి బెంగళూరు నగరవాసులను నిండా ముంచింది. వాస్తవానికి నీటి ట్యాంకర్ల సరఫరాదారులు సైతం రేట్లను భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ధనికులు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన ఐటీ ఎంప్లాయిస్, పనులు చేసుకుంటూ జీవించే మధ్యతరగతి ప్రజలకు నీరు కొనుక్కోవటం మోయలేని భారంగా మారింది. సంపాదనలో దాదాపు ఒక వంతు వీటికే సరిపోతోందని చాలా మంది చెబుతున్నారు.

నగరాల్లో వేలకు వేలు అద్దెలు చెల్లిస్తూ కనీసం నీరు కూడా లేని ఇళ్లలో ఉండటానికి ఇప్పుడు చాలా మంది విముఖత చూపుతున్నారు. అలాగే లక్షలు, కోట్లు వెచ్చించి గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లు కొన్న వారి పరిస్థితి కూడా ఇదే. వస్తున్న ఆదాయాల కంటే వేగంగా ఖర్చులు పెరగటం బెంగళూరులో నివసిస్తున్న ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా భారీగా పెరిగిన నిత్యావసరాలు, అధిక అద్దెలకి తోడు ఒక్కో ఫ్యామిలీకి నెలకు రూ.8-10 వేల వరకు నీళ్ల ట్యాంకర్లకు ఖర్చు కావటంతో చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. దీంతో బెంగళూరు నగరంలో ఇళ్లు ఖాళీ అవుతూ To-let బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయని ఓనర్లు లబోదిబోమంటున్నారు.
నీటి ఎద్దడితో చాలా మంది నగరాన్ని వీడుతున్న వారి సంఖ్య గత రెండు నెలలుగా భారీగానే పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితులతో బెంగళూరు నగరంలోని ఇళ్ల యజమాలు ఒక్కసారిగా అయోమయానికి గురవుతున్నారు. ఓనర్లు సైతం తమ ఇంటి అద్దెలను 10-20 శాతం మేర తగ్గించినా ఫలితం కనిపించటం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అద్దె రూ.27-35 వేలు చెప్పిన ఓనర్లు ప్రస్తుతం రూ.20 వేలకే అద్దెకు ఇల్లు ఇస్తామన్నా ఎవ్వరూ ఆసక్తి చూపటం లేదట. పైగా కేవలం నెలకు నీళ్ల కోసంమే రూ.15-20 వేలు ఖర్చుచేయాల్సి రావటంతో నగరం నడిబొడ్డులోని ప్రధాన ఐటీ హబ్స్ దగ్గరి ఏరియాల్లో సైతం ఇళ్లు ఖాళీలు పెరిగిపోతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఇదర లొకేషన్లలోని ఆఫీసులకు తమ పనిని మార్చుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications