ఆ ఉద్యోగులకు జగన్ శుభవార్త, వేతనం ఏకంగా రెండింతలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులు (VOA), మురికివాడలు, పట్టణస్థాయి సమాఖ్యాల రిసోర్స్ పర్సన్స్ (RP)ల గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేతన పెంపు వేలాది కుటుంబాలకు శుభవార్త. దాదాపు 36 వేల మందికి వేతనం పెరగనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, వీఓఏ, ఆర్పీలకు వేతనాలు పెంచుతూ శుభవార్త చెప్పింది.
పన్నుచెల్లింపుదారులకు శుభవార్త, ట్యాక్స్ నోటీసులు తనిఖీ చేసుకోవచ్చు
ఎంత పెంచారు?
గతంలో పై ఉద్యోగులకు రూ.5వేల గౌరవ వేతనం అందేది. అయితే ఇప్పటి ప్రభుత్వం దీనిని రూ.10,000కు పెంచింది. ఇక నుంచి ఆయా సంఘాలు, సమాఖ్యల నుంచి రూ.2 వేలు, ప్రభుత్వం నుంచి రూ.8వేలు వీరికి గౌరవ వేతనం లభిస్తుంది.
ఎంతమందికి ప్రయోజనం?
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 35 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 27,797 మంది VOAలకు, 8,034 మంది RPలకు లబ్ధి చేకూరనుంది. మొత్తంగా సమాఖ్య పరిధిలో ఉండే సంఘాల వ్యవహారాలను 35,831 మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తున్నారు.
ఎప్పటి నుంచి అమలు?
డిసెంబర్ 1వ తేదీ నుంచి గౌరవ వేతనాల పెంపు నిర్ణయం అమలులోకి వస్తుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొదుపు సంఘాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారు. దీంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాల తీర్మానాల వంటి అంశాలను ఎఫ్పటికి అప్పుడు రికార్డ్ చేసేందుకు, బ్యాంకు అధికారులతో పొదుపు సంఖాలకు సంబంధించిన రుణాలపై మాట్లాడటం వంటి కార్యకలాపాలు వీరు నిర్వహిస్తారు. వీరిని గతంలో యానిమేటర్లు, సంఘమిత్రలు అనేవారు.
ఉత్తర్వులు జారీ
గతంలో చంద్రబాబు ప్రభుత్వం వీరికి ప్రభుత్వం నుంచి రూ.3వేలు, సమాఖ్యల నుంచి రూ.2వేల చొప్పున.. మొత్తం రూ.5వేల గౌరవ వేతనం ఇచ్చేంది. ఆర్పీలకు నామమాత్రపు గౌరవ వేతనం ఉండేది. తాజాగా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్యామలారావు సోమవారం వీరి వేతనాలు రూ.5వేల నుంచి రూ.10వేలు పెంచుతూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.