ఎయిరిండియా, విస్తారా విమాన సర్వీసులపై హాంగ్కాంగ్ నిషేధం
ఎయిరిండియా, విస్తారా విమానాలను హాంగ్కాంగ్ బ్యాన్ చేసింది. అక్టోబర్ 17వ తేదీ నుండి 30వతేదీ మధ్య నిషేధం కొనసాగనున్నట్లు తెలిపింది. భారత్ నుండి తమ దేశానికి వచ్చిన ప్రయాణీకుల్లో కొందరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హాంగ్కాంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాపై హాంగ్ కాంగ్ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో ఆగస్ట్ 18వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ మధ్య, సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ మధ్య నిషేధం విధించింది. విస్తారా విమానాలను మొదటిసారి బ్యాన్ చేసింది.
జూలై నెలలో హాంగ్కాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా పరీక్షల్లో కరోనా నెగిటివ్ నిర్ధారణ అయితే భారత్ నుండి హాంగ్కాంగ్ రావాలని పేర్కొంది. అంతేకాకుండా హాంగ్కాంగ్ విమానాశ్రయంలో పోస్ట్ ఫ్లైట్ కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి.
ముంబై, ఢిల్లీల కంటే హైదరాబాద్ అదుర్స్.. కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో టాప్
ఢిల్లీ-హాంగ్కాంగ్ ఎయిరిండియా విమానం, చెన్నై-హాంగ్కాంగ్ విస్తారా విమానంలో కొంతమంది ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హాంగ్కాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంగ్కాంగ్లో ఇప్పటి వరకు 5,238 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. కరోనా ప్రభావిత జాబితాలో 128వ స్థానంలో ఉంది.