హిందుజా గ్రూప్ ఛైర్మన్ అస్తమయం.. ఖండాతరాలకు బిజినెస్ విస్తరించిన ఖ్యాతి ఆయన సొంతం
Hinduja: బ్రిటిష్ బిలియనీర్, హిందూజా గ్రూప్ ఛైర్మన్ శ్రీచంద్ పర్మానంద్ హిందూజా బుధవారం లండన్ లో కన్నుమూశారు. "ఈరోజు మా కుటుంబ పితామహులు మరణించినట్లు ప్రకచించడానికి గోపీచందే, ప్రకాష్, అశోక్ సహా హిందూజా గ్రూప్ మొత్తం విచారం వ్యక్తం చేస్తున్నాము" అని ఆయన ఫ్యామిలీ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా నలుగురు అన్నదమ్ముల్లో ఎస్పీ హిందూజా (87) పెద్దవారు.
"తండ్రి దివంగత PD హిందూజా గారి విలువలను అందిపుచ్చుకుని కుటుంబానికి మార్గదర్శకునిగా శ్రీచంద్ నిలబడ్డారు. ఆయన దూరదృష్టి అమోఘం. ఆయన నివసిస్తున్న UKకి స్వదేశం భారత్ కు మధ్య తన సోదరులతో కలిసి బలమైన సంబంధాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. లోతైన ఆధ్యాత్మికత, పరోపకార స్వభావి" అని ప్రతినిధి తెలిపారు.
UKలోని అత్యంత ధనవంతులలో SP హిందూజా ఒకరు. ఆయన తండ్రి పర్మానంద్ దీప్ చంద్.. ఇరాన్ లో మర్చంట్ బ్యాంకింగ్ మరియు ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఇక్కడే శ్రీచంద్ బిజినెస్ కెరీర్ ఆరంభించారు. గ్రూప్ వ్యాపారానికి మర్చంట్ బ్యాంకింగ్ మరియు వాణిజ్యం రెండు మూల స్తంభాలులా ఉండేవి. ఐరోపాకు వెళ్లే ముందు 1979 వరకు గ్రూప్ ప్రధాన కార్యాలయం ఇరాన్ లోనే ఉండేది.
SP హిందూజా నాయకత్వంలో ఏళ్ల తరబడి హిందూజా గ్రూప్ తన కార్యకలాపాలను నిర్వహించింది. వైవిధ్య సేవలను అందిస్తూ నేడు ఖండాంతరాల వరకు విస్తరించింది. వాణిజ్య వాహనాలు (అశోక్ లేలాండ్), లూబ్రికెంట్లు (గల్ఫ్ ఆయిల్), బ్యాంకింగ్ (ఇండస్ఇండ్ బ్యాంక్), IT, మీడియా, వినోదం & కమ్యూనికేషన్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, చమురు & ప్రత్యేక రసాయనాలు, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఆరోగ్య సంరక్షణ సహా పలు ఇతర రంగాల్లో నిరాటంకంగా వ్యాపారం నిర్వహిస్తోంది..