వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు...కారణం అదే..!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరసుగా మూడో రోజు పెరిగాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను అమెరికా బలగాలు మట్టుబెట్టడంతో అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ముడి చమురు ధరలపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి.
ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను మట్టుబెట్టడంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం వల్ల ఏక్షణమైనా ఏమైనా జరిగే అవకాశాలుండటంతో ట్రేడర్లు కూడా బిజినెస్కు దూరంగా ఉన్నారు. దీంతో బ్యారెల్ ముడి చమురు 4.5శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో సౌదీలో చమురు కంపెనీలపై దాడులు జరిగిన తర్వాత అప్పుడు పెరిగిన ధరలు తిరిగి నిన్నటి ఘటనతో మళ్లీ ఈ స్థాయిలో పెరిగాయి. ఇక త్వరలోనే లీటరు పెట్రోల్ ధర రూ.100 మార్కును తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ఒక్కసారి పరిశీలిస్తే, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో లీటరు పెట్రోల్పై 10 పైసలు పెరుగగా, చెన్నైలో 11 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీ కోల్కతా నగరాల్లో లీటరు డీజిల్పై 15 పైసలు పెరుగగా చెన్నై ముంబైల్లో 16 పైసలు మేరా పెరిగాయి. మొత్తానికి గత మూడు రోజులుగా పరిశీలిస్తే పెట్రోల్ 15 పైసలు నుంచి 21 పైసలు, డీజిల్ 23 పైసలు నుంచి 29 పైసల మేరా పెరుగుదల నమోదు చేసింది.
పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వ ఆయిల్ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ రోజువారీగా ధరలను సమీక్షించి ఫిక్స్ చేస్తుంది. ఒకవేళ ధరలను పెంచాలని భావిస్తే కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి.2017 జూన్ నెల నుంచి ఈ విధమైన రోజూవారి ధరలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. దేశీయ ఇంధన ధరలు మాత్రం రూపాయితో డాలరు మారకంతో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.


Click it and Unblock the Notifications


